గురువారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన తొక్కిసలాటను హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ లైట్ తీసుకున్నారు. ఇంత పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు చిన్నా చితక ఘటనలు జరుగుతాయని.. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని ఆయన అన్నారు.  

ఈ నెల 25న జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించి జింఖానా గ్రౌండ్‌లో గురువారం టికెట్లు విక్రయించగా తొక్కిసలాట జరిగింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వెంటనే రంగంలోకి దిగిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ను, ఇతర కార్యవర్గ సభ్యులను పిలిపించి మాట్లాడారు. అయితే ఇంత జరిగినప్పటికీ అజార్ మాత్రం లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి, మీడియా ఎదుటే ఆయన వితండవాదం చేశారు. ఇంత పెద్ద మ్యాచ్ జరిగినప్పుడు చిన్నా చితక ఘటనలు జరుగుతాయని ఆజారుద్దీన్ వ్యాఖ్యానించారు. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు జరగలేదని... తమకు మ్యాచ్ నిర్వహణే ముఖ్యమని మంత్రి ఎదుటే రివర్స్ అయ్యారు ఆజారుద్దీన్. 

Also REad:జింఖానా గ్రౌండ్స్ ఘటనపై ఇద్దరితో కమిటీ, క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం:మంత్రి శ్రీనివాస్ గౌడ్

అటు టికెట్ల గోల్‌మాల్‌ వ్యవహారాన్ని కూడా లైట్ తీసుకున్నారు ఆజారుద్దీన్. ఇవాళ జరిగింది దురదృష్టకర ఘటనేనన్న ఆయన.. మాకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. మీ దగ్గర కూర్చిన ముచ్చట్లు చెప్పడానికి తనకు టైమ్ లేదని అజారుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను వెళ్లి మ్యాచ్ నిర్వహణ చూసుకోవాలని.. మ్యాచ్ నిర్వహణ అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడినంత తేలిక కాదని అజారుద్దీన్ అన్నారు. ఇంత జరిగినా తమ తప్పు లేదంటున్నారు అజారుద్దీన్. మ్యాచ్ టికెట్లన్నీ అయిపోయాయని, ఆన్‌లైన్‌లో పెట్టడానికి కూడా లేవని ఆయన తేల్చిచెప్పారు. ఎన్ని టికెట్లు అమ్మాము అన్నది రేపు చెబుతామని అజారుద్దీన్ పేర్కొన్నారు.