Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సీబీఐకి అప్పగింత: తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  తీర్పును తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు రిజర్వ్  చేసింది. ఈ కేసుకు సంబంధించి  వాదనలు ముగిశాయి.  

HC reserves Verdict on  plea seeking CBI probe into BRS MLAs poaching attempt case
Author
First Published Jan 18, 2023, 1:02 PM IST

హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసు విచారణను సీబీఐకి అప్పగించిన విషయమై  అన్నివర్గాల వాదనలను  తెలంగాణ  హైకోర్టు వింది. ఈ విషయమై   తీర్పును  తెలంగాణ హైకోర్టు రిజర్వ్  చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల  ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగిస్తూ  తెలంగాణ హైకోర్టు  గత ఏడాది డిసెంబర్  26వ తేదీన  తీర్పును వెల్లడించింది. సిట్  విచారణ  పారదర్శకంగా లేదని  ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ సహా  మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించి  హైకోర్టు  సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని సవాల్  చేస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్  బెంచ్ లో  ఈ నెల  4వ తేదీన  తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసుపై అన్ని వర్గాల వాదనలను  తెలంగాణ హైకోర్టు విన్నది.    తెలంగాణ ప్రభుత్వం తరపున దుశ్యంత్ ధవే  వాదనలు విన్పించారు. ఇవాళ కూడా దుష్యంత్ ధవే తన వాదనలు విన్పించారు.ఈ విషయమై ఈ నెల  30వ తేదీ లోపుగా  వాదనలను సమర్పించాలని  హైకోర్టు ఆదేశించింది. 

2022 అక్టోబర్  26వ తేదీన మొయినాబాద్ ఫాం హౌస్ లో  నలుగురు బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారనే  ఎప్ఐఆర్ నమోదైంది. అచ్చంపేట, కొల్లాపూర్,  పినపాక,  తాండూరు ఎమ్మెల్యేలు  గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు,  పైలెట్ రోహిత్ రెడ్డిలను ప్రలోభాలకు గురి చేశారని  కేసు నమోదైంది.  రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ లు   ఈ నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలను గురి చేశారని  అందిన ఫిర్యాదు ఆధారంగా  కేసు నమోదైంది.  

also read:సీబీఐ విచారిస్తే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ సర్కార్ వాదన

ఈ కేసును విచారించేందుకు  తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణ పారదర్శకంగా లేదని  బీజేపీ సహా  పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ  విషయమై దాఖలైన  ఐదు పిటిషన్లలో  రెండు పిటిషన్లను  కొట్టివేసింది. మిగిలిన మూడు పిటిషన్లకు సంబంధించిన అభ్యర్ధనల మేరకు సీబీఐ విచారణకు  తెలంగాణ హైకోర్టు  ఆదేశించింది. సీబీఐ  విచారణను ప్రభుత్వం సవాల్  చేసింది.  ఈ కేసు విషయమై  ప్రతివాదుల వాదనలను హైకోర్టు ఇప్పటికే విన్నది. తమ వాదనలను  తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కూడా విన్పించింది. ఈ నెల  30వ తేదీ తర్వాత  ఈ విషయమై తెలంగాణ హైకోర్టు   ఈ విషయమై  తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios