అధికారం కోసమే కాంగ్రెస్ శుష్క వాగ్దానాలు : హరీష్ రావు ఫైర్
గరం గరం..
దేశమంతా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కితే , తెలంగాణ లో మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు రైతుల వద్దకే సాయమందించేందుకు వెళుతున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు. పంజాబ్ లో టమాటా రైతులు, తమిళనాడు లో రైతుల అర్థనగ్న ప్రదర్శనలు, మహారాష్ట్ర రైతులు 400 కిలోమీటర్ల పాదయాత్రలు సాగుతున్నాయన్నారు. తెలంగాణలో పంట పెట్టుబడి చెక్ ల పంపిణీ, ఉచిత విద్యుత్ వంటి ప్రయోజనాలు రైతులకు దక్కుతున్నాయన్నారు. ఇవాళ మంత్రి హరీష్ రావుమెదక్ జిల్లా పాపన్న పేటమార్కెట్ యార్డును ప్రారంభించారు.
4.42 కోట్లతో మార్కెట్ అభివృద్ధి పనులు చేపట్టినట్లుతెలిపారు. ఎంత పంట పండినా ఇక రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలో 1590 రూ మద్దతుధరతో 34 లక్షల టన్నుల వడ్లు కొన్నామని మంత్రి హరీష్ రావుతెలిపారు. మొత్తం మీద యాసంగి, వర్షాకాల పంటలు కలిపితే 8377 కోట్లతో 52 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ధర తగ్గిిన మక్కలకు 1425 రూ మద్దతు ధరతో, 7 లక్షల 44 వేల మెట్రిక్ టన్నుల ను 436 కోట్లు ఖర్చుచేసి కొనుగోలు చేసినట్లు చెప్పారు. మినుములు 5400 రూ మద్దతు ధరతో, పెసలు 5575 రూ ధరతో, శనగలు 4400 రూ ధరతో, జొన్నలు 1700 రూ ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. రైతులకు మద్ధతు ధర, పంట పెట్టుబడి, సరళమైన భూరికార్డులు, ఉచిత విద్యుత్ పంపిణీ వంటివి అవసరమని చెప్పారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా ఆలోచించి వీటన్నింటిన దేశంలోి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఈ ప్రాంత రైతుల కోసం ఘనపురం ఆనకట్ట ను 200 కోట్లతో ఆధునీకరించామన్నారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ వచ్చి ధర్నాలు చేస్తే తప్ప ఘనపురం ఆనకట్టకు నీరు ఇచ్చే వారు కాదని విమర్శించారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఘనపురం ఆనకట్టకు నీరివ్వడం ద్వారా 31 వేలఎక రాలకు నీరు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంటుకోతలు,ఎరువులు, విత్తనాల కొరతలు..కాని సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఈ సమస్యలే లేకుండా చేశారని చెప్పారు. త్వరలో పాస్ బుక్ ఉన్న ప్రతీరైతుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. ప్రభుత్వమే రైతుకు 2271.70 బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ఏ కారణంతో రైతు చనిపోయినా ఐదు లక్షల రూపాయలు రైతు సూచించిన నామినీకి దక్కుతుందన్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రైతుల కోసం ఏమీ చేయకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. రైతులు ఆనందంతో ఉంటే కాంగ్రెస్ నేతలు కన్నీరు పెట్టు కుంటున్నారని ఎద్దేవా చేశారు. ఘనపురం ఆనకట్ట కు కాంగ్రెస్ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. కాంగ్రెల్ పార్టీ అధికారంలోకి రావడానికి శుష్క వాగ్థానాలుచేస్తోందని మండిపడ్డారు. ఒక్క తడి తగ్గకుండా, ఒక్క మడి ఎండకుండా 3 పంటలకు ఘనపురం ఆనకట్ట ద్వారా నీరిచ్చామన్నారు. తెరాస ప్రభుత్వం అధికారం లోకి రాకపోతే, సీఎం గా కేసీఆర్ లేకపోతే ఇది సాధ్యమేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. రైతులకు సాగు నీటి కోసం కాళేశ్వరం పనులువేగంగా ప్రభుత్వం జరుపుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 9 వేల మంది ఇంజనీర్లు, 25 వేల మంది కార్మికులు మూడు షిఫ్ట్ లలో పని చేస్తున్నారని చెప్పారు. పాపన్నపేట మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ కార్యక్రమం లో ఉప సభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , కలెక్టర్ ధర్మా రెడ్డి పాల్గొన్నారు.