హజీపూర్ సీరియల్ రేపిస్టు: అమ్మాయిలతో వేములవాడకు షికారు
అమ్మాయిలతో కలిసి శ్రీనివాస రెడ్డి వేములవాడకు తరుచుగా వస్తుండేవాడని అంటున్నారు. మహా శివరాత్రి రోజునే మనీషా అదృశ్యం కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. వేములవాడలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన సీసీటీవీ ఫుటేజీలను స్థానిక పోలీసులు పరిశీలిస్తున్నారు.
వేములవాడ: హజీపూర్ సీరియల్ రేపిస్టు, కిల్లర్ మర్రి శ్రీనివాస రెడ్డికి వేములవాడలో కొంత మందితో సంబంధాలున్నాయనే రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ వ్యాఖ్యలపై స్థానికంగా విస్తృత చర్చ సాగుతోంది. హజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం, హత్య కేసుల్లో నిందితుడు శ్రీనివాస రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే.
అమ్మాయిలతో కలిసి శ్రీనివాస రెడ్డి వేములవాడకు తరుచుగా వస్తుండేవాడని అంటున్నారు. మహా శివరాత్రి రోజునే మనీషా అదృశ్యం కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. వేములవాడలోని పలు ప్రాంతాల్లో నెలకొల్పిన సీసీటీవీ ఫుటేజీలను స్థానిక పోలీసులు పరిశీలిస్తున్నారు. అదే సమయంలో నేర చరిత్ర గల వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు.
పది రోజుల క్రితం పోలీసులు వేములవాడలోని అగ్రహారం హిల్స్ లో ఓ గుర్తు తెలియని మహిళ శవం పోలీసుల కంటపడింది. ఆ మహిళకు దాదాపు 35 ఏళ్లుంటాయి. ఆ మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు తేలినట్లు సమాచారం.
పది రోజుల తర్వాత కూడా ఆ మహిళ వివరాలు తెలియడం లేదు. వేములవాడ పట్టణం పరిసరాల్లోని పోలీసు స్టేషన్లలో మహిళల అదృశ్యానికి సంబంధించిన ఫిర్యాదులు కూడా ఏమీ లేవు. వేరే ప్రాంతం నుంచి ఆ మహిళను తీసుకుని వచ్చి దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.