జగన్ తో పొత్తు లేదు: టీడీపి వ్యాఖ్యలపై గుత్తా క్లారిటీ
వైఎస్ జగన్ను కేటీఆర్ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
నల్గొండ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారని ఆయన స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ను కేటీఆర్ కలవడంతో టీడీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వైఎస్ జగన్ కు లభిస్తున్న ప్రజాదరణ చూడలేకనే ఆ విధమైన విషప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసి ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్ని ఏ విధంగా తిరస్కరించారో, ఆంధ్రాలో కూడా టీడీపీని కాంగ్రెస్ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని ఆయన అన్నారు.