నాశనం చేసుకొన్నాడు, ఆ దేవుడు కూడ గెలిపించలేడు: ఈటలపై గుత్తా సంచలనం
తనని తాను రాజకీయంగా నాశనం చేసుకొన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మాజీ శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్గొండ: తనని తాను రాజకీయంగా నాశనం చేసుకొన్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై మాజీ శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం నాడు నల్గొండలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు..రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవన్నారు.ఈటలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన చెప్పారు.
దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు. .మొన్న ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపికి పరాభవం ఎదురైందని విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలోకి వెళ్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఈటెల రాజేందర్ కి కేసీఆర్ గారు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ ఓటమి పాలు కావడం ఖాయమన్నారు.ఆయన్ని ఆ దేవుడు కూడా గెలిపించలేడనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.2026 ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుతాయన్నారు. నియోజకవర్గాల డిలిమిటేషన్ 2026లో పూర్తికానుందని ఆయన చెప్పారు. రానున్న ఎన్నికల్లో మాత్రం ఇప్పుడున్న రిజర్వేషన్లు వర్తించే విధంగా ఎన్నికలు జరుగుతాయి.వ్యవసాయ రంగం టి ఆర్ యస్ పాలనలో అద్భుతమైన అభివృద్ధి చెందిందని చెప్పారు..24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూశారన్నారు.
ధాన్యం పండించడంలో అతి త్వరలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోందనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. తన కుమారుడు అమిత్ రెడ్డి మొదటినుండి క్రమశిక్షణతో పెరిగాడు.ఏదైనా పని మొదలుపెడితే సాదించేవరకు వదలని పట్టుదల అమిత్ రెడ్డికి ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి అపదకాలంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాలకు అతీతంగా తన తండ్రి పేరున ట్రస్ట్ ని స్టార్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. రాజకీయాలతో సంబందం లేకుండా గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరుపున సేవ కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు.