నాకు గౌరవం ఇవ్వకపోతే నేనేమి తక్కువ కాను.. నా పనిని కొనసాగిస్తాను: గవర్నర్ తమిళిసై సంచలన కామెంట్స్
రాజ్భవన్ ప్రజాభవన్గా మారిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. రాజ్భవన్పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు.
రాజ్భవన్ ప్రజాభవన్గా మారిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. రాజ్భవన్పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళిసై.. కొద్దిసేపటి తర్వాత ఇంగ్లీష్లో ప్రసంగాన్ని కొనసాగించారు. తమిళిసై మాట్లాడుతూ.. స్త్రీల సమస్యలు తగ్గించేందుకు మహిళా దర్బార్ నిర్వహించామని చెప్పారు. 75 మంది మెరిట్ విద్యార్థులకు ఆగస్టు 15న బహుమతులు అందించామని తెలిపారు. ఎన్నో యూనివర్సిటీలు, హాస్టళ్లను సందర్శించానని, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని అన్నారు. బాసరా ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యల చూసి చలించిపోయానని అన్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రికి లేఖలు రాశానని చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో పర్యటించానని చెప్పారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ క్రాస్ ద్వారా సేవ చేశామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఉందని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మలమైన మనసుతో ముందుకు సాగుతానని చెప్పారు. తనకు గౌరవం ఇవ్వకపోతే తానేమి తక్కువ కానని.. తన పనిని తాను కొనసాగిస్తానని చెప్పారు. సన్మానం జరిగినా జరగకపోయినా తన కృషిలో మార్పు ఉండదని చెప్పారు. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగిన స్పందించలేదని తమిళిసై అన్నారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించినట్టుగా చెప్పారు.
తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని చెప్పారు. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదల కోసం తన పని కొనసాగిస్తుంటానని చెప్పారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్భవన్ను గౌరవించాలి కదా అని అన్నారు. తనకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవని చెప్పారు.
ఏట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైనది కాదని అన్నారు. ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.