LB Nagar Police Station: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఓ మహిళను ఇద్దరు పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. అంతటితో ఆగకుండా సదరు మహిళపై లాఠీలతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
TS Governor Tamilisai soundararajan: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున అర్ధరాత్రి 11 గంటల తర్వాత ఓ మహిళను ఇద్దరు పోలీసులు ఠాణాకు తీసుకువచ్చారు. అంతటితో ఆగకుండా సదరు మహిళపై లాఠీలతో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, భారతీయ రెడ్క్రాస్ సొసైటీ (IRCS), రంగారెడ్డి జిల్లా శాఖ, బాధితురాలి ఇంటిని సందర్శించి, ఆమెకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని వెంటనే అందించాలని గవర్నర్ ఆదేశించారు.
వివరాల్లోకెళ్తే... ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో లంబాడా మహిళపై పోలీసులు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాచకొండ కమిషనర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం వివరణ కోరారు. 48 గంటల్లో ఈ ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను తనకు పంపాలని ఆదేశించారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందనీ, రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే తనను నిర్బంధించి కొట్టారని బాధితురాలు తెలిపినట్టు మీడియా కథనాల ద్వారా తనకు తెలిసిందని గవర్నర్ పేర్కొన్నారు.
వైద్య లక్ష్మి అనే మహిళను నైట్ పెట్రోలింగ్ స్క్వాడ్ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి రాత్రంతా నిర్బంధించి కొట్టారు. మీర్ పేట నివాసి అయిన బాధితురాలు తన కుమార్తె వివాహానికి కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం కోరేందుకు ఎల్బీనగర్ లోని తన కుటుంబాన్ని చూసేందుకు వెళ్లగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో కొందరు పోలీసులు తన కాళ్లపై తోలు బెల్ట్ పట్టీలతో కొట్టారని, తాను ఏడ్చినా వెళ్లనివ్వలేదని లక్ష్మి విలేకరులతో చెప్పారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలతను సస్పెండ్ చేశారు.
ఈ వ్యవహారంలో డీజీపీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ లంబాడా సామాజిక వర్గం (షెడ్యూల్డ్ తెగలు) సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. అయితే, హైవేపై నిల్చొని వ్యభిచార కార్యకలాపాలు చేయిస్తోందనీ, దీంతో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొనడం గమనార్హం. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టినట్లు ఎల్బీనగర్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై 48 గంటల్లోగా చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాచకొండ పోలీస్ కమిషనర్ నుంచి సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు.