పీహెచ్ డీ అంటే.. డిగ్రీ అనుకున్నారా..? గవర్నర్ సీరియస్
పీహెచ్ డీలను డిగ్రీ పట్టాలు పంచిపెట్టడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలోని యూనివర్శటీల పనితీరుపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్ డీలను డిగ్రీ పట్టాలు పంచిపెట్టడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పీహెచ్డీలు ఏమైనా బీఏ డిగ్రీలా? యూనివర్సిటీల్లో వందల మందికి ఏ విధంగా అవార్డులు ప్రదానం చేస్తున్నారు? పీహెచ్డీలు ఎంతో విలువైనవి. అవి పరిశోధనాత్మకంగా ఉండాలి. సాధారణ డిగ్రీల్లా ఉండకూడదు’ అని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఇప్పటివరకు కొనసాగుతున్న పీహెచ్డీలపై సమీక్ష నిర్వహించి తనకు నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించిన వర్సిటీల వీసీల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీహెచ్డీ అడ్మిషన్ల విషయంలో అన్ని యూనివర్సిటీలు ఒకే విధానం పాటించాలన్నారు.
ముఖ్యంగా ప్రవేశ పరీక్షను రద్దు చేసి నెట్, సెట్ వంటి వాటి ద్వారానే ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. వర్సిటీలతోపాటు అనుబంధ కాలేజీల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని వీసీలు, అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలను మూసివేయాలన్నారు.