దళితబంధుపై ప్రభుత్వ కీలక నిర్ణయం.. త్వరలో వారి ఖాతాల్లో రూ.9 వేలు..
దళితబంధు పథకం అమలు విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దళితబంధు పథకం కింద ఇంత వరకు రూ.10 లక్షలు పొందిన లబ్దిదారుల అకౌంట్లలో వడ్డీ జమ చేయాలని భావిస్తోంది. ఈ వడ్డీ దాదాపుగా రూ.9 వేల వరకు ఉండనుంది.
దళితబంధు.. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగిన పథకం. దళితుల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చిందని పలు మార్లు సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.10 లక్షలు అందిస్తారు. ఇవి నేరుగా వారి అకౌంట్లో పడిపోతాయి. అయితే ఈ పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రూ. 10 లక్షలపై వడ్డీ...
దళితబంధు కింద అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని భావించింది. అది వారి సాధికారతకు ఉపయోగడపడుతుందనే సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకాన్ని మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా హుజూరాబాద్ నియోజకర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో పాటు సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలోనూ దీనిని ప్రారంభించింది. అయితే హుజూరాబాద్లో పలువురి కుటుంబాలకు, అలాగే సీఎం దత్తత గ్రామంలోని 76 కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేసింది. వారి బ్యాంక్ అకౌంట్లలో రూ.10 లక్షలు జమ చేసింది. అయితే దాదాపు ఈ పథకం ప్రారంభించి దాదాపు మూడు నెలలు అవుతోంది. అయితే రూ.10 లక్షల నగదుకు వడ్డీ ఇవ్వాలని భావిస్తోంది. గరిష్టంగా దాదాపు రూ.9 వేలు వడ్డీ అవుతుందని, ఆ వడ్డీని దళితబంధు లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం కలెక్టర్లు, మంత్రులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
దళితబంధుపై సీఎం కీలక వ్యాఖ్యలు..
కలెక్టర్లు, మంత్రులతో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో దళితబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. ముందుగానే నిర్ణయించిన విధంగా ఆ నాలుగు మండలాల్లో మొదటగా నిర్వహించాలని తెలిపారు. తరువాత విడతల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని చెప్పారు. ఏళ్లుగా వివక్షకు ఎదుర్కొంటున్న దళిత జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేందుకు ఈ పథకం తీసుకొచ్చామని పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం ఇన్ని పథకాలు అమలు చేసినా.. ఈ దళితబంధు పథకం అమలు చేస్తే గొప్ప సంతృప్తి దక్కుంతుందని చెప్పారు. దళితబంధు పథకం వల్ల దళితులు ఆర్థిక స్వాలంభన సాధిస్తారని అన్నారు. ఈ పథకం అమలులో మేథావులు, నిపుణుల సలహాలు స్వీకరించాలని అధికారులకు సూచించారు.
శామీర్ పేటలో బీభత్సం... ఏడు కార్లను ఢీకొట్టిన ఆర్మీ వాహనం
28 నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు..
కలెక్టర్లు, మంత్రులతో సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ రైతుబంధుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు పెట్టబడి సాయం జమ చేయాలని ఆదేశించారు. తెలంగాణలో ఉన్న రైతులందరికీ ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. వరి రైతులకు కూడా అందిస్తామని అన్నారు. కొత్తగా పాసు పుస్తకాలు పొందిన రైతులు కూడా ఈ పథకానికి అర్హులే అని చెప్పారు. ఆ రైతులు రైతుబంధు కోసం స్థానిక ఏఈవోల దగ్గర దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.