శ్రీరామనవమీ వేడుకల్లో నన్ను టార్గెట్ చేశారు .. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
శ్రీరామనవమి సందర్భంగా తనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఉగ్రవాది ప్లాన్ చేశాడంటూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తి సీపీకి రాసిన లేఖను రాజాసింగ్ పోస్ట్ చేశారు.
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా తనను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. మార్చి 31న సర్థార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం, శ్రీరామ శోభాయాత్రపై బాంబులు విసిరేందుకు ఓ ఉగ్రవాది ప్లాన్ చేశాడంటూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తి సీపీకి రాసిన లేఖను రాజాసింగ్ పోస్ట్ చేశారు. శ్రీరామ శోభాయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నందున తమకు సమాచారం ఇవ్వాలని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇదిలావుండగా రాజాసింగ్కు ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించిన సంగతి తెలిసిందే . అయితే తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరుచూ మరమ్ముత్తులకు గురువుతుందని.. చెప్పినా రిపేర్ చేసి తిరిగి మళ్లీ అదే వాహనాన్ని కేటాయిస్తున్నారని ఇటీవల రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ వాహనం పలు మార్గమధ్యంలోనే నిలిచిపోతుండటంతో.. అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని తెలిపారు. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారని.. అందులో తన పేరు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు. తనకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్న విషయం పోలీసులకు తెలుసని.. అయినా తన భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారని చెప్పారు.
Also REad: అలా చేయకపోతే.. ఇప్పుడున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెనక్కి తీసుకోండి: ఇంటెలిజెన్స్ ఐజీకి రాజాసింగ్ లేఖ
ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి పరిస్థితి దారుణం అంటూ సెటైరికల్ కామెంట్స్ కూడా చేశారు. తన భద్రతకు ముప్పు ఉందని.. కొత్త వాహనం ఇవ్వడానికి కేటీఆర్ అనుమతి లేదా అని ప్రశ్నించారు. లేకపోతే అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించారు. తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేకపోతే.. నాకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోవాలని.. పాత వాహనాన్ని తాను వినియోగించలేనని రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్కు గత నెలలో కొత్త బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది.