అర్హత నిబంధనల సడలింపు !ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన

గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు సవాలక్ష నిబంధనలు పెట్టడంతో అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేసిన విషయం తెలిసింది. ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాలు వర్సిటీ బంద్ కు కూడా పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలపై ప్రభుత్వం స్పందించింది.గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త అందించింది.

నోటిఫికేషన్ కు అప్లై చేసుకోడానికి టీఎస్సీపీయస్సీ పెట్టిన నిబంధనలు సవరించేందుకు సీఎం కార్యాలయం సిద్ధమైంది.

గురుకుల విద్యా సంస్థల్లో అధ్యాపకుల నియమాకానికి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, గతంలో అనుసరించిన విధానాలు, న్యాయస్థానాల తీర్పులను అనుసరించే మార్గదర్శకాలను రూపొందించి పాటించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గురుకుల విద్యాసంస్థల్లో అత్యుత్తమ బోధన జరగడం, నిరుద్యొగ యువకులకు ఉద్యోగావకాశాలు రావవడం లక్ష్యంగా నియమాకాలు జరగాలని ఆదేశించారు.

ఎన్.సి.టి.ఇ మార్గదర్శకాల ప్రకారం డిగ్రీలో 50 శాతం మార్కులు వచ్చిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని సిఎం ఆదేశించారు. ఖచ్చితంగా 60 శాతం మార్కులు ఉండాలనే నిబంధన తొలగించాలని ఆదేశించారు. దీనివల్ల ఎక్కువ మంది నిరుద్యోగులకు పరీక్ష రాసే అవకాశం కలుగుతుందన్నారు. మూడు సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలనే నిబంధన కూడా తొలగించాలని సిఎం ఆదేశించారు. 

డిగ్రీ, బిఇడి, టెట్ అర్హత ఉన్నవారందరికీ ఎలాంటి అర్హత లేకపోయినా అవకాశం ఇవ్వాలని సిఎం సూచించారు. తెలుగు మీడియంలో పరీక్ష నిర్వహించాలనే విజ్ఞప్తిపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. ఎన్.సి.టి.ఇ మార్గదర్శకాలు, గతంలో న్యాయస్థానాల తీర్పులను పరిశీలించారు. దీని ప్రకారం ఏ మీడియం విద్యార్థులకు ఏ మీడియంలో బోధించడానికి నియమాకాలు జరుగుతున్నాయో అదే భాషలో పరీక్ష నిర్వహించాలని గతంలో సుప్రిం కోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో తెలుగు మీడియంలో పరీక్ష రాసే అవకాశం లేనందున అభ్యర్థులు ఇంగ్లీషు మీడియంలోనే రాయాలని సిఎం సూచించారు. వీటికి అనుగుణంగా తాజా మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు.