ఆన్లైన్ క్లాస్లో డౌట్: ఇంటికొచ్చి విద్యార్ధినితో లెక్చరర్ అసభ్య ప్రవర్తన
ఆన్లైన్ లో క్లాసులు బోధించే పేరుతో విద్యార్ధినుల పట్ల కొందరు టీచర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.ఈ విషయమై హైద్రాబాద్ నగరంలో పలు కేసులు నమోదౌతున్నాయి. తాజాగా కూకట్ పల్లిలో మరో కేసు నమోదైంది. బాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు షీ టీమ్స్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్: ఆన్లైన్ లో క్లాసులు బోధించే పేరుతో విద్యార్ధినుల పట్ల కొందరు టీచర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.ఈ విషయమై హైద్రాబాద్ నగరంలో పలు కేసులు నమోదౌతున్నాయి. తాజాగా కూకట్ పల్లిలో మరో కేసు నమోదైంది. బాధిత విద్యార్ధిని తల్లిదండ్రులు షీ టీమ్స్ ను ఆశ్రయించారు.
కరోనా నేపథ్యంలో విద్యా సంస్థలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. ఆన్ లైన్ లోనే ఆయా విద్యాసంస్థలు విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నాయి. విద్యాసంస్థలు తెరిచే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం అధికారాన్ని ఇచ్చింది. ఈ మేరకు అన్ లాక్ 5.0 లో కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
కూకట్ పల్లికి చెందిన ఓ విద్యార్ధిని ప్రతి రోజూ ఆన్ లైన్ లో క్లాసులు వింటుంది. అయితే ఆ విద్యార్ధినికి లెక్చరర్ బోధించిన సబ్జెక్టుపై సందేహాలు వచ్చాయి. ఈ విషయమై ఆమె లెక్చరర్ దీపక్ మిశ్రాను అడిగింది. అయితే ఆ విద్యార్ధిని అడిగిన సందేహాలను తీర్చేందుకు ఆయన ఆమె ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చిన లెక్చరర్ విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. విద్యార్ధిని తల్లిదండ్రులు ఈ విషయమై షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు. షీ టీమ్స్ నేతృత్వంలో బృందం మిశ్రా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆన్ లైన్ క్లాసుల పేరుతో విద్యార్ధినులను వేధిస్తున్న కేసులు నగరంలో పెరిగిపోతున్నాయి. గత నెలలో సైబరాబాద్ పరిధిలో 161 కేసులు నమోదయ్యాయి. ఆన్ లైన్ క్లాసుల విషయంలో తల్లిదండ్రులు కొంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.