హైదరాబాద్ లాడ్ బజార్ గాజులకు జీఐ గుర్తింపు.. అధికారిక ప్రకటనే తరువాయి..
హైదరాబాద్ లాడ్ బజార్ గాజులకు జీఐ గుర్తింపు దక్కింది. చైన్నైలోని జీఐ రిజిస్ట్రీ ఆఫీసు దీనిని ఆమోదించింది. ఈ గుర్తింపుతో లాడ్ గాజులు ప్రపంచ వ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకోనున్నాయి.
హైదరాబాద్ లాడ్ బజార్ గాజులకు ఓ ప్రత్యేకత ఉంది. చార్మినర్ చూసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరూ వీటిని కొనుగోలు చేయకుండా ఉండరు. రంగు రంగుల్లో చూడ ముచ్చటగా ఉండే ఈ గాజులపై మహిళలు ఎందుకు మనసు పారేసుకోరు చెప్పండి. అయితే ఈ గాజులకు ఇప్పుడు మరో ఘనత దక్కింది. ఇప్పటి నుంచి వీటి పేరు అంతర్జాతీయంగా మారు మోగనున్నాయి. ఎందుకంటారా అయితే ఇది చదవాల్సిందే..
తెలంగాణ : ఇంటర్లో ఇకపై వంద శాతం సిలబస్
భారతదేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ లాడ్ గాజులకు భౌగిళిక గుర్తింపు (జీఐ) దక్కింది. ఈ మేరకు చేసిన దరఖాస్తును తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న జీఐ రిజిస్ట్రీ ఆఫీసు గురువారం ఆమోదించింది. దీంతో ఇప్పుడు ఈ గాజులకు మరింత గొప్ప పేరు రానుంది. ఈ గాజులను లక్కతో తయారు చేస్తారు. ఈ లక్కను లాడ్ అని కూడా అంటారు. అందుకే ఈ గాజులను లాడ్ బజార్ గాజులు అని కూడా పిలుస్తారు. ఈ గాజులు చార్ మినార్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతారు కాబట్టి దానికి లాడ్ బజార్ అనే పేరు కూడా వచ్చింది.
వీటిని ఐదు వందల సంవత్సరాల కిందట మొఘలుల కాలంలోనే తయారు చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి గాజులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా దొరకవు. వీటి తయారీపై ఆధారపడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ వివరాలను అన్నీ సేకరించి జీఐ రిజిస్ట్రీకి దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించిన అధికారులు గురువారం ఆ దరఖాస్తుకు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ గుర్తింపు ఖాయమైంది. అయితే త్వరలో అధికారులు వచ్చి ఈ లాడ్ బజార్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. తరువాత అధికారికంగా ఇక్కడి నుంచి ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా ఇప్పుడు ఈ లక్క గాజులకు జీఐ గుర్తింపు రావడంతో ఆఫీసర్లు స్పెషల్ గా ఈ గాజుల లోగోను తయారు చేయించారు. ఈ జీఐ గుర్తింపు రావడంతో మరింత మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది.