పుల్లారెడ్డి స్వీట్స్లో జీహెచ్ఎంసీ అధికారుల తనిఖీలు..జరిమానా
పంజాగుట్టలోని పుల్లారెడ్డి స్వీట్ షాపులో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపుతోంది.
పంజాగుట్టలోని పుల్లారెడ్డి స్వీట్ షాపులో బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సింగతిల్ యూజ్ ప్లాస్లిక్ కవర్లు వాడుతున్న నేరంపై రూ.20 వేల జరిమానా విధించారు అధికారులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
కాగా.. గతేడాది పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి రాఘవరెడ్డి కుటుంబానికి చెందిన వరకట్న వేధింపుల వివాదం మరోసారి తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ప్రజ్ఞారెడ్డి లేఖలో కోరారు. శీతకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గత నెల 29న షేక్ పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అయితే ఆ కాలేజ్తో పుల్లారెడ్డి కుటుంబానికి సంబంధం ఉంది. శ్రీవిద్యారెడ్డి ఈ కాలేజ్కు వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతికి ప్రజ్ఞారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
ALso Read: న్యాయం చేయండి.. రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు లేఖ..
రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డిలు గత రెండేళ్లుగా తనను, తన ఎనిమిదేళ్ల కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజ్ఞారెడ్డి ఆరోపించారు. వారు గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను గదిలోంచి బయటికి రానివ్వకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారని లేఖలో వివరించారు. కోర్టు స్పందించి, ఆ గోడ కూల్చేయాలని చెప్పిందని చెప్పారు. వారు తనను, తన కుమార్తెను చంపేందుకు ప్రయత్నించారని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తన అత్త భారతిరెడ్డిపై హైదరాబాదులో భూకబ్జా కేసులు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఓ మహిళగా సాటి మహిళ వేదనను అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో మీకు ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇక, పుల్లారెడ్డి స్వీట్స్ వ్యవస్థాపకుడు జి పుల్లారెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు జి రాఘవరెడ్డి పుల్లారెడ్డి గ్రూప్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఆయన కుమారుడు ఏక్ నాథ్ రెడ్డికి 2014లో ప్రజ్ఞారెడ్డితో వివాహం జరిగింది. ప్రజ్ఞారెడ్డి తండ్రి కేఆర్ఎం రెడ్డి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. అయితే ఏక్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని ప్రజ్ఞారెడ్డి కొన్ని నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఏక్నాథ్ రెడ్డితో పాటు రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డిలపై గృహహింస చట్టం కింద కేసు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తనను, తన కుమార్తెను బేగంపేటలోని వారి ఇంట్లో ఆహారం, నీరు అందించకుండా నిర్బంధించారని ప్రజ్ఞారెడ్డి ఆరోపించారు. అతి కష్టం మీద తాను పోలీసులకు ఫోన్ చేశానని చెప్పారు.