ప్రజల డబ్బులతో పాలకుల షోకులు
- జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల ఆర్బాటాలు
- కొత్త కార్ల కోసం రూ 3 కోట్ల నిధులు
- స్టాండింగ్ కమిటీ ఆమోదం
నగర ప్రజలు నానా అవస్థలు పడి పన్నులు కడుతుంటే, జీహెచ్ఎంసీ అధికారులు ఆ డబ్బుతో షోకులు చేస్తున్నారు. తమ అధికార దర్పం కోసం ప్రజల సొమ్ముని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు.
పారిశుద్యానికి, రోడ్ల మరమ్మతులకు నిధులు లేవంటూనే తమ ఆర్బాటాలకు ఏ మాత్రం లోటు రాకుండా చూసుకుంటున్నారు.అధికారులే కాదు, మేయర్, డిప్యూటి మేయర్ కూడా అదే తీరును కనబరుస్తుండటంతో సమస్యలను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడంటున్నారు నగర ప్రజలు.
జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కొత్త వాహనాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.అందుకోసం అక్షరాల రూ 3 కోట్ల నిధులను కేటాయించుకున్నారు. స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన ఈ నిర్ణయానికి ప్రభుత్వ ఆమోదం తప్పనిసరి కావడంతో.. జీహెచ్ఎంసీ అధికారులు సర్కారుకు లేఖ రాశారు. ప్రభుత్వం ఆమోదిస్తే పై వారితో పాటు కమిషనర్, జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ సిటీ ప్లానర్లకు కొత్త కార్లు రానున్నాయి.
ప్రస్తుతం అధికారులు వాడుతున్న వాహనాలు బాగానే ఉన్నా,కొత్త కార్లకై వారు వెంపర్లాడుతున్నారు. ఇలా కార్ల కోసం అధికారులు ఆరాటపడటం బయటకు పొక్కడంతో ప్రజలు మండిపడుతున్నారు.వీటిపై ఉన్న శ్రద్ద ప్రజా సమస్యలపై ఉంటే బాగుటుందని వారు వాపోతున్నారు.