జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రసాభాస.. మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన బీజేపీ కార్పొరేటర్లు
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం సమావేశం ప్రారంభమైనప్పటీ నుంచి బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం సమావేశం ప్రారంభమైనప్పటీ నుంచి బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. నలుగురు బీజేపీ కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరిక అంశంపై ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్లను మన్నె కవిత అభినందించారు. టీఆర్ఎస్ సిద్దాంతాలు నచ్చి ఆ కార్పొరేటర్లు తమ పార్టీలో చేరారని బాబా ఫసియుద్దీన్ అన్నారు. అయితే టీఆర్ఎస్ సభ్యుల తీరుపై బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను అక్రమంగా అరెస్ట్ చేశారని కొందరు బీజేపీ కార్పొరేటర్లు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
అయితే బీజేపీ కార్పొరేటర్లు వెళ్లి వారి స్థానాల్లో కూర్చొవాల్సిందిగా మేయర్ గద్వాల విజయలక్ష్మి సూచించారు. అయినప్పటికీ బీజేపీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మేయర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం కొద్దిసేపటి క్రితం సమావేశం తిరిగి ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడించేందుకు కాంట్రాక్టర్లు యత్నించారు. జీహెచ్ఎంపీ పాలకమండలి సర్వసభ్య సమావేశం వేళ బల్దియా కాంట్రాక్టర్లు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. అయితే పోలీసులు అనుమతించకపోవడంతో వారు లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లక పలువురు బీజేపీ కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. కొత్త నిబంధనలతో జీహెచ్ఎంసీ తమను ఇబ్బందులకు గురిచేస్తుందని బల్దియా కాంట్రాక్టర్లు ఆరోపించారు. పెండింగ్లో ఉన్న 800 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కార్పొరేటర్లు అక్కడి నుంచి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.