అక్రమ కట్టడాలు, దురాక్రమణలపై జిహెచ్ఎంసి ఉక్కుపాదం
అక్రమార్కులారా పరార్ కాండి. కొత్త టెక్నిక్ వస్తుంది...
విపత్తుల నిర్వహణ, అక్రమ కట్టడాల నిరోధం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై దేశంలో మరే నగరంలోలేనట్టి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన డిజాస్టర్ మేనేజ్మెంట్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు కానుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్పై ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రమే ప్రత్యేక విభాగం ఉంది. ముంబాయి కార్పొరేషన్తో పోలిస్తే జీహెచ్ఎంసీలో డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ కలిపి పటిష్టమైన విభాగాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వ స్థలాలు, చెరువుల దురాక్రమణలను అడ్డుకోవడం, విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకుగాను జీహెచ్ఎంసీలో ప్రత్యేకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటుచేసి ఆ విభాగానికి ఐ.పీ.ఎస్ అధికారిని డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది.
జీహెచ్ఎంసీ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి నేడు తనను కలిసిన విలేకరులకు తమ విభాగం కార్యకలాపాలను వివరించారు. మార్చి 23వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఐ.పి.ఎస్ అధికారి విశ్వజిత్ కంపాటిని నియమించినప్పటికీ మే 10వ తేదీన మాత్రమే డైరెక్టర్ విధులు, బాధ్యతలు, అధికారాలను కేటాయించి ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది. దీంతో జీహెచ్ఎంసీలో ఎన్ఫోర్స్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, విజిలెన్స్ విభాగాలను పటిష్టం చేయడానికి అదనపు సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సాధించారు. ఈ విభాగాల పటిష్టతకు అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో పోలీసు, ఇంజనీరింగ్, ఫైర్ సర్వీసులు తదితర శాఖల నుండి డిప్యుటేషన్పై నియామకానికి చర్యలు చేపట్టారు.
నగరంలో చెరువుల దురాక్రమణలను అరికట్టడం, ప్రభుత్వ, జీహెచ్ఎంసీ ఆస్తుల పరిరక్షణకు ఈ విభాగంలో ప్రత్యేకంగా లేక్స్, అసెట్స్ ప్రొటెక్షన్, ఫోర్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. దీంతో పాటు విపత్తుల నివారణకుగాను వెంటనే స్పందించడానికిగాను ప్రత్యేకంగా 8క్విక్ రెస్పాన్స్ బృందాలు, విపత్తుల నివారణ దళాలు, లేక్స్ ప్రొటెక్షన్ ఫోర్స్లను ఏర్పాటు చేసే ప్రక్రియ పురోగతిలో ఉంది. ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి 16వాహనాలను ప్రత్యేకంగా కేటాయించడంతో వీటిలో 8వాహనాలను ఎన్ఫోర్స్మెంట్కు మరో 8వాహనాలను డిజాస్టర్ మేనేజ్మెంట్లకు కేటాయించారు. జీహెచ్ఎంసీలోని స్ట్రీట్లైట్స్ విభాగంలో మిగులుగా ఉన్న 44మంది ఔట్సోర్సింగ్ వర్కర్లను విజిలెన్స్ విభాగానికి కేటాయించినట్లు, వీరికి విపత్తుల నిర్వహణలో ప్రతిరోజు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు. మరో 2 రోజుల్లో మాన్సూన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పరికరాలను సమకూర్చుకోనున్నట్టు విశ్వజిత్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో విపత్తుల నివారణ పై మొట్టమొదటి సారిగా ప్రత్యేకంగా మ్యాన్వల్ను రూపొందించి అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖలు చేపట్టాల్సిన బాద్యతను ఈ మ్యాన్వల్లో పేర్కొనడం జరిగిందని తెలిపారు. ప్రధానంగా నాలా, చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల స్థలాల దురాక్రమణలపై ప్రత్యేకంగా దృష్టి సాధింనున్నామని, అయితే జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలకు లోబడే తమ విభాగం పనిచేస్తోందని డైరెక్టర్ స్పష్టం చేశారు. తమ విజిలెన్స్, ఇన్స్పోర్ట్స్మెంట్ విభాగాన్ని బుద్ద భవన్లో ఏర్పాటు చేయడం జరిగిందని, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సిస్టమ్ మాదిరిగానే బుద్ద భవన్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ నిషేదానికి తమ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రత్యేకంగా కృషిచేయనుందని, నిబంధనలను అతిక్రమించి వారికి జరిమానాలు విధించేందుకు ప్రత్యేకంగా ట్యాబ్లను ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులకు ఉన్న మాదిరిగానే బాడీ ఓన్ కెమెరాలను విజిలెన్స్ అధికారులు, సిబ్బందికి అందించనున్నారు.
నగరంలోని చెరువులలో భవన నిర్మాణ వ్యర్థాలను నివారణ, కబ్జాలను అరికట్టడానికి 900 సీసీ కెమెరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని కంపాటి తెలిపారు. గత 15రోజులుగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా 16 ఆక్రమణలు తొలగించామని తెలిపారు. అయితే జీహెచ్ఎంసీలో ప్రస్తుతం ఇతర విభాగాల్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.