మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటి పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆఫీసుపై బీజేపీ నేత దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీసులోని ఫర్నీచర్ ధ్వంసం అయింది.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటి పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆఫీసుపై బీజేపీ నేత దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీసులోని ఫర్నీచర్ ధ్వంసం అయింది. వివరాలు.. బొక్కోని గూడ 3వ వార్డ్ కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి ఆఫీస్పై బీజేపీ నేత కొమ్మిడి మహిపాల్ రెడ్డి దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో సంగీత డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ దాడిలో ఆఫీసు అద్దాలు, ఇతర ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి.
ఈ ఘటనకు సంబంధించి కౌన్సిలర్ సంగీత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత కొమ్మిడి మహిపాల్ రెడ్డి తన ఆఫీసుపై దాడి చేశారని అన్నారు. తాను ఆఫీసు వద్దకు వచ్చేసరికే అద్దాలు పగలగొట్టారని చెప్పారు. తాను అడ్డుకుంటే పక్కకు నెట్టాడని.. తనను, తన భర్తను చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అసభ్య పదజాలంతో చెప్పరాని మాటలతో దూషించారని చెప్పారు. తమకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఆడవాళ్ల మీద చేయి వేస్తారా? అని ప్రశ్నించారు. ఎవరూ లేనప్పుడు వచ్చి ఆఫీసుపై దాడి చేయడమేమిటని ప్రశ్నించారు. తమకు ప్రాణభయం ఉందని అన్నారు.
రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కౌంటర్లోని డబ్బులను కూడా తీసుకెళ్లాడని చెప్పారు. మహిపాల్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
