కేసీఆర్ ఇలాకాలో గతంలో కాంగ్రెస్దే హవా
మ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1952 నుండి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగుతోంది.
గజ్వేల్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1952 నుండి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హావా కొనసాగుతోంది. 2014 లో ఈ స్థానం నుండి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు.మరోసారి ఈ స్థానం నుండే కేసీఆర్ బరిలోకి దిగుతున్నారు.
1952లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఒక ఉప ఎన్నికతో పాటు 15 దఫాలు ఈ స్థానానికి ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు 9 దఫాలు విజయం సాధించారు.
టీడీపీ అభ్యర్థులు నాలుగు సార్లు, పీడీఎఫ్ , టీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కసారి విజయం సాధించారు.1957లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో జరిగిన ఎన్నికల్లో జనరల్ కేటగిరి సీటు ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు చెప్పడంతో ఉప ఎన్నిక జరిగింది.ఈ ఎన్నికల్లో కూడ ఆర్. నరసింహరెడ్డి విజయం సాధించారు. చ 1957లో కూడ ఆయనే విజయం సాధించారు.
1962లో ఇండిపెండెంట్గా ఈ స్థానం నుండి పోటీ చేసిన సైదయ్య ఆ తర్వాత కాంగ్రెస్, అటు పిమ్మట కాంగ్రెస్ (ఐ) నుండి నాలుగు దఫాలు గజ్వేల్ నుండి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థిగా బి. సంజీవరావు రెండు దఫాలు ఈ స్థానం నుండి విజయం సాధించారు.
1989, 2004 ఎన్నికల్లో ఈ స్థానం నుండి మాజీ మంత్రి జె. గీతారెడ్డి విజయం సాధించారు. 1952లో గజ్వేల్ స్థానం నుండి పి.వాసుదేవ పిడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎం.హెచ్ రావుపై విజయం సాధించారు. వాసుదేవకు (21785 ఓట్లు), కాంగ్రెస్ అభ్యర్థి ఎంహెచ్ రావుకు (6261ఓట్లు) మాత్రమే వచ్చాయి.
1957లో గజ్వేల్ ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. ఈ ఎన్నికల్లో ఆర్.నరసింహరెడ్డి జనరల్ కేటగిరి కింద, రిజర్వ్డ్ స్థానంలో జేబీ. ముత్యాలరావు కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. జనరల్ స్థానంలో అవకతవకలు జరిగాయని 1958లో ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో ఆర్. నరసింహరెడ్డి విజయం సాధించారు. 2009 నుండి ఈ సెగ్మెంట్ జనరల్గా మారింది.
1962లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన సైదయ్య (11653), కాంగ్రెస్ అభ్యర్థి వెంకటస్వామి(10,626) ఓట్లు వచ్చాయి.1967లో జి.సైదయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సైదయ్య పోటీచేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సైదయ్యకు 21,762 ఓట్లు వచ్చాయి, ఇండిపెండెంట్ అభ్యర్థి కృష్ణమూర్తికి 16324 ఓట్లు మాత్రమే వచ్చాయి.
1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి సైదయ్య(24,611) తన సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి ఎ.సాయిలు(19,673)పై విజయం సాధించాడు. 1978లో జి.సైదయ్య(33,550), జనతా పార్టీ అభ్యర్థి ఎ.సాయిలు(24,819)సై విజయం సాధించాడు.
1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎ.సాయిలు (36,544) తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జి.సైదయ్య(32,583) పై విజయం సాధించారు.1985లో ఎ.సాయిలు టీడీపీ(43,874) అభ్యర్థిగా మరోసారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సైదయ్య(36,492)పై ఆయన గెలిచారు.
1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా జె. గీతారెడ్డి(48,974) ఈ స్థానం నుండి పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బి.సంజీవరావు(45616) పై గీతారెడ్డి గెలుపొందారు.
1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జి.విజయరామారావు(52,234) తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జె. గీతారెడ్డిపై (32,942) విజయం సాధించారు. 1999లో టీడీపీ అభ్యర్థి బి.సంజీవరావు (57,335) తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జె.గీతారెడ్డిపై (54,908)పై విజయం సాధించారు.
2004లో జె.గీతారెడ్డి 71,955) కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి డి. దుర్గయ్య(47695)పై విజయం సాధించారు.2009లో ఈ నియోజకవర్గం జనరల్గా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టి నర్సారెడ్డి (74,443 ) తన సమీప టీడీపీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డిపై (67,268)పై విజయం సాధించారు.2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ (86694) పోటీచేసి తన సమీప టీడీపీ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి(67303)పై విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇదే స్థానం నుండి కేసీఆర్ మరోసారి పోటీ చేస్తున్నారు.గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి మూడు మాసాల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ దఫా వంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
సిద్దిపేట సరళి: మామను మించిన అల్లుడు