భట్టి పాదయాత్రలో గద్దర్ ప్రత్యక్షం.. ‘గద్దరన్న జీవితం ప్రజలకు అంకితం’
మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో అనూహ్యంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రత్యక్షమయ్యారు. భట్టి పాదయాత్ర చరిత్రాత్మకమైందని ప్రశంసించారు. అలాగే.. గద్దరన్న తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని భట్టి పేర్కొన్నారు.
హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యపేట జిల్లాలో కొనసాగుతున్నది. ఈ రోజు చివ్వెంల మండలం, చందుపట్ల బీ, తిమ్మాపురం గ్రామాల మీదుగా సాగింది. అయితే, అనూహ్యంగా ఈ రోజు భట్టి పాదయాత్రలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ ప్రత్యక్షం అయ్యారు. తిమ్మాపురంలో మీడియాను ఉద్దేశించి వారిద్దరూ మాట్లాడారు.
మల్లు భట్టి విక్రమార్క.. గద్దర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. గద్దర్ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారని వివరించారు. అలాగే, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలూ సంధించారు. తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నామని, సిద్ధించిన రాష్ట్రంలో ప్రజలు ఆశించిన ఫలాలు దక్కట్లేదని భట్టి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరలేరనే లేదని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం పెరుగుతూనే ఉన్నదని అన్నారు. భారత్ జోడో యాత్రకు భయపడే రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం రద్దు చేయించారని ఆరోపణలు చేశారు. అంతే వేగంగా అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించారని వివరించారు.
Also Read: 150 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. బండ్ల గణేష్
కాగా, గద్దర్ మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర చరిత్రాత్మకమైనదని కొనియాడారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కారాలను సూచిస్తూ ముందుకు వెళ్లడం అభినందనీయం అని అన్నారు. ఈ పాదయాత్ర తప్పకుండా గణనీయమైన మార్పు తీసుకువస్తుందని ఆశించారు. కాంగ్రెస్ ప్రజల్లో బలమైన మద్దతును ఈ పాదయాత్ర తీసుకువస్తుందని, అదే బలీయమైన ఓటు శక్తిగా పరిణామం చెందుతుందని అభిప్రాయపడ్డారు.
తాను ఇటీవలే గద్దర్ ప్రజా పార్టీని నమోదు చేయించానని గద్దర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను ఈ పాదయాత్రను తన పార్టీ తరఫున మద్దతు పలుకుతున్నట్టు వివరించారు.