అమిత్ షాకు సీల్డ్ కవర్ అందజేసిన గద్దర్.. అందులో ఏముందంటే ?
ఇటీవల బీజేపీ తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను గద్దర్ కలుసుకున్నారు. ఈ సమయంలో కేంద్ర మంత్రికి ఆయన ఓ సీల్డ్ కవర్ అందజేశారు. అందులో ఏముందనే విషయంలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ప్రజా గాయకుడు గద్దర్ సెంట్రల్ హోం మినిస్టర్ అమిషాతో భేటీ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ తుక్కుగూడలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభ సందర్భంగా గద్దర్, కేంద్ర హోం మంత్రిని కలుసుకున్నారు.
వీరిద్దరి మధ్య కొంత సమయం సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. ఆ సభ జరిగిన సమయంలో వీరి భేటీ విషయం ఎవరికీ తెలియదు. కానీ ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. అసలు వీరిద్దరి మధ్యన జరిగిన మీటింగ్ ఉద్దేశం ఏంటన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. గద్దర్ ఆయనతో ఏం మాట్లాడారనే విషయంలో రకరకాల ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి.
ఈ నెల 21 నుండి రైతు రచ్చబండ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
అయితే వీరి మధ్య సమావేశం సందర్భంగా కేంద్ర హోం మంత్రికి గద్దర్ ఓ సీల్డ్ కవర్ అందజేశారని భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు. ఆ సీల్డ్ కవర్ గోధుమ రంగులో ఉందని అన్నారు. ఆ సీల్డ్ కవర్ లో తనపై ఉన్న కేసులు ఎత్తివేయాలని ప్రజా గాయకుడు కోరినట్టు తెలుస్తోంది. ఆ కేసులకు సంబంధించిన వివరాలే, మిగితా సమాచారం ఆ సీల్డ్ ఉందని ప్రచారం కొనసాగుతోంది.
గద్దర్ కు విప్లవ కవి, గాయకుడిగా మంచి పేరుంది. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన ఒక సమయంలో రాజ్యాన్ని ధిక్కరించి తన స్వరాన్ని వినిపించారు. సాయుధ పోరాటాన్ని సమర్దించారు. జనంలో చైతన్యం వచ్చేలా ఎన్నో పాటలు పాడారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన పాడిన పాటలు తెలంగాణలో నలు మూలల వినిపించాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ఆయన టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు.
నేనెక్కడికి పారిపోలేదు, పరుగెత్తించే రకం: కరాటే కళ్యాణీ
కానీ కొంత కాలంగా ఆయన అన్ని పార్టీల లీడర్లను కలుస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టగా..అందులో ఆయన పాల్గొన్నారు. కొంత కాలం తరువాత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చారు. ఆ సమయంలో రాహుల్ గాంధీని వెళ్లి కలిసి మాట్లాడారు. తరువాత మళ్లీ ఇప్పుడు బీజేపీ ముఖ్య నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి మాట్లాడారు. అయితే గతంలో ఆయన సాయుధ పోరాటంలో ఉన్నప్పుడు కేసులు ఉండటం, వాటి వల్ల ఇప్పుడు ఇబ్బందులు తలెత్తడం వంటి విషయాల వల్లే ఆయన పలువురు నాయకులను కలుస్తున్నారని చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షాను కలిసి ఇదే కేసుల విషయాన్ని విన్నవించారని తెలుస్తోంది.