సినిమాలో క్లైమాక్స్లా కారు.. తృటిలో బావిలో పడేదే
అచ్చు సినిమాలో చూపినట్టుగా జగిత్యాల జిల్లాలో ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు
కరీంనగర్: అచ్చు సినిమాలో చూపినట్టుగా జగిత్యాల జిల్లాలో ఆదివారం నాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సంఘటన జరిగిన తీరును చూస్తే నలుగురు ప్రమాదం నుండి బయటపడడం వారి అదృష్టంగా చెప్పుకొంటున్నారు.
జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరు గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం ఓ కారు అదుపుతప్పి వ్యవసాయబావి అంచు వద్ద ఆగిపోయింది. ఈ కారులో ప్రయాణీస్తున్న నలుగురు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారికి స్వల్పగాయాలయ్యాయి.
గోదావరిఖని నుండి కరీంనగర్ కు నలుగురు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కారు ముందు టైరు ఒకటి బావిలోకి వెళ్లింది. కారు వెనుక టైరుకు ఓ రాయి అడ్డుపడింది. ఈ రాయి కారణంగానే కారు బావిలో పడకుండా నిలిచిపోయింది.
ఈ బావిలో సుమారు 10 అడుగుల మేర నీరుంది. బావిలో కారు బోల్తా కొడితే ఈ నలుగురు ప్రాణాలతో బయటపడేవారు కాదు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో కారు బావి ముందుభాగంలో నిలిపోయింది.
కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ బావికి రక్షణగా ఓ గోడ ఏర్పాటు చేయాలని కోరినా కూడ చర్యలు తీసుకోలేదన్నారు.