ఖమ్మం: నవరాత్రి వేడుకల్లో అపశృతి... అమ్మవారి ఊరేగింపు ట్రాక్టర్ బోల్తా, నలుగురు మృతి
దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన దుర్గమ్మ విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృత్యువాతపడిన విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఖమ్మం: నవరాత్రుల్లో ఎంతో భక్తిశ్రద్దలతో పూజించిన అమ్మవారి విగ్రహ నిమజ్జనం కోసం చేపట్టిన ఊరేగింపులో అపశృతి చోటుచేసుకుంది. దసరా పండగ తర్వాతిరోజు గ్రామస్తులంతా కలిసి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన khammam district లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటుచేసారు. తొమ్మిది రోజులు అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్దలతో పూజించి దసరా తర్వాతిరోజు(శనివారం) నిమజ్జనం చేపట్టారు. ఓ ట్రాక్టర్ లో అమ్మవారి విగ్రహాన్ని గ్రామమంతా ఊరేగించారు. వైభభవంగా ఊరేగింపు పూర్తిచేసి నిమజ్జనం కోసం వెళుతుండగా ఘోరం జరిగింది.
read more ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ, రెండు నెలలు తిరుగకముందే నవ వధువు ఆత్మహత్య
అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని వెళుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ కింద నలిగి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరికొందరు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిపాలయ్యారు.
ఈ ఘటనతో అప్పటివరకు ఎంతో ఆనందంగా వేడుక జరిగిన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.