ఎన్టీఆర్ పై త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ దేవ్ ప్రశంసల జల్లు.. ఆయనే నిజమైన హీరో, దేవుడు అంటూ కితాబు..
ఆదిలాబాద్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో త్రిపుర మాజీ సీఎం.. తెలుగుదేశం అధినేత, దివంగత ఎన్టీఆర్ మీద ప్రశంసల జల్లు కురిపించారు.
ఆదిలాబాద్ : తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ఆతర్వాత అనతికాలంలోనే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్ అసలైన హీరో అని.. దేవుడని బీజేపీ సీనియర్ నేత, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ వ్యాఖ్యానించారు. అంతకుముందు వరకు శాసనసభలో ఏమాత్రం ప్రాతినిధ్యమే లేని స్థితి నుంచి ప్రజా బలంతో ఒక్కసారిగా 9నెలల్లోనే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారని గుర్తు చేశారు.
సీనియర్ ఎన్టీఆర్ లాగే త్రిపుర రాష్ట్రంలో కూడా బిజెపి కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొడుతుందని.. రాజకీయ ప్రభంజనం సృష్టిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుంది అని ధీమాను వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అధ్యక్షతన ఆదిలాబాద్ నియోజకవర్గంలోని క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిప్లవ్ దేవ్ పాల్గొన్నారు. మీడియాతో కూడా మాట్లాడారు. బోధ్ లో ప్రకాష్ జవదేకర్, అసిఫాబాద్ లో డయ్యూ డామన్ అధ్యక్షుడు దీపేష్ తండల్, కాగజ్ నగర్ లో మణిపూర్ అధ్యక్షులు శారదా దేవి, ముధోల్ లో మాజీ మంత్రి రాజవర్ధన్ సింగ్ లు పాల్గొన్నారు.