వారసులను గెలిపించాలి.. ఇల్లరికపు అల్లుళ్లను కాదు, అన్నగారి వారసుడు జూనియర్ ఎన్టీఆరే : కొడాలి నాని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని.. మామ, అల్లుడు కాదంటూ చురకలు వేశారు.
అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీ (tdp), చంద్రబాబుపై (chandrababu naidu) విరుచుపడే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి (kodali nani) నాని మరోసారి తన నోటికి పనిచెప్పారు. కేబినెట్ పునర్వ్యవస్ధీకరణలో స్థానం దొరక్కపోవడంతో కొద్దికాలం సైలెంట్ గా వున్న కొడాలి నాని... మళ్లీ రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ నేత , మాజీ మంత్రి కొల్లు రవీంద్రను (kollu ravindra) టార్గెట్ చేశారు. మచిలీపట్నంలో వారసుడినే గెలిపించాలని... ఇల్లరికం వచ్చిన రవీంద్రను కాదంటూ హాట్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ తరపున పేర్ని నాని (perni nani) నిలబడినా, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి నిలబడినా గెలిపించాలని ప్రజలకు కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.
వారసత్వమంటే తాత, తండ్రి, కొడుకు అని... మామ, అల్లుడు కాదని నాని వ్యాఖ్యానించారు. వారసత్వం అంటే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ అని... సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ (jr ntr) అని చెప్పారు. అన్నగారి వారసుడు జూనియర్ ఎన్టీఆరే అని ఈ సందర్భంగా నందమూరి కుటుంబంపై ఆయన వ్యాఖ్యలు చేశారు. మామ పేరు చెప్పుకునే ఇల్లరికం అల్లుళ్లు మనకెందుకంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడిపై కొడాలి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు, బందరులో కొల్లు రవీంద్ర వంటి ఇల్లరికం అల్లుళ్లను ఇంటికి పంపించాలంటూ నాని సెటైర్లు వేశారు.
ALso Read:గుడివాడ కొడాలి నాని అడ్డా, ఓడించే దమ్ము ఎవరికీ లేదు: వైసీపీ ప్లీనరీలో మంత్రి జోగి రమేష్
మరోవైపు నిన్న గుడివాడలో జరిగిన వైసీపీ ప్లీనరీలోనూ కొడాలి నాని .. టీడీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తనను ఓడించడం కాదని.. ముందు 2024లో కుప్పంలో గెలవాలంటూ నాని చురకలు వేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ చంద్రబాబును ఆయన దత్తపుత్రుడిని ఓడిస్తామని కొడాలి నాని అన్నారు. 2024, 29 ఎన్నికల్లోనూ గెలిచేది తానేనని.. బతికినా, చచ్చినా అది గుడివాడలోనేనని.. చంద్రబాబులా పుట్టిన ఊరు వదిలి పారిపోనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు నిమ్మకూరులో బసచేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తుందని కొడాలి నాని అన్నారు. వైఎస్ మరణం వల్లనే రాష్ట్రం రెండు ముక్కలైందని... జగన్కు అడ్డంగా నిలబడ్డ తమను దాటుకొని చంద్రబాబు, దత్తపుత్రుడు ముందుకు వెళ్లాలని నాని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ వారసుడి మాదిరిగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ప్రశంసల వర్షం కురిపించారు.