Vijaya Sankalpa Sabha: బీజేపీలోకి చేరిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. కండువా కప్పి ఆహ్వానించిన జేపీ నడ్డా
చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ రోజు పరేడ్ గ్రౌండ్స్ నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభలో ఆయన బీజేపీలో చేరారు. విజయసంకల్ప సభలో తాను బీజేపీలో చేరబోతున్నట్టు ఆయన స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ గూటికి చేరారు. ఈ రోజు హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభా వేదికగా ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయనను కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ల సమక్షంలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరారు.
మాజీ డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడు కొండా విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుంచి ఎంపీగా ఎన్నికై 16వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ టికెట్పై ఆయన ఎంపీగా గెలిచారు. 2013లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆహ్వానం మేరకు కొండా విశ్వేశ్వరరెడ్డి గులాబీ పార్టీలో చేరారు. కాగా, 2018లో ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్లో చేరారు. కానీ, కాంగ్రెస్లోనూ ఆయన ఎక్కువ కాలం కొనసాగలేదు. గతేడాది మార్చిలో కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తాజాగా, బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఇదే సభలో కేంద్ర మంత్రి అమిత్ షాా మాట్లాడుతూ కేసీఆర్పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాన్ని సాధించామా అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యిందా అని అమిత్ షా నిలదీశారు. కేసీఆర్.. నా మాటలను జాగ్రత్తగా గుర్తుంచుకో ... నీది కాదు, నీ కొడుకుది కాదు.. వచ్చేసారి బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
తన కొడుకును సీఎం చేయడానికే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ పార్టీ గుర్తు అయిన కారు స్టీరింగ్ .. ఓవైసీ చేతుల్లో వుందని ఆయన ఎద్దేవా చేశారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్ భారత్ లో భాగం అయ్యేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. విమోచన దినాన్ని కేసీఆర్ ఎందుకు అధికారికంగా జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఓవైసీకి భయపడే విమోచనం దినాన్ని కేసీఆర్ జరపడం లేదని అమిత్ షా దుయ్యబట్టారు.