బీజేపీకి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ రాజీనామా చేశారు. బీజేపీలో బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
బీజేపీకి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ రాజీనామా చేశారు. బీజేపీలో బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతోందని అన్నారు. బీజేపీలో అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ఆర్థిక లాభం కోసమే మునుగోడు ఉప ఎన్నిక అని విమర్శించారు. ఇంకా బీజేపీలోనే కొనసాగితే అర్థం లేదన్నారు. ఇక, భిక్షమయ్య గౌడ్ ఆరు నెలల క్రితమే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
ఇక, భిక్షమయ్య గౌడ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన భిక్షమయ్య గౌడ్.. టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్లో సరైన గుర్తింపు దక్కడం లేదని భావించిన భిక్షమయ్య గౌడ్.. ఈ ఏడాది ఏప్రిల్లో బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్చుగ్.. భిక్షమయ్య గౌడ్కు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
