సారాంశం

ఎన్నికల్లో గెలుపు కోసం  అధికార , విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో  ఈ దఫా మెజారిటీ సీట్లు దక్కించుకోవడం  బీఆర్ఎస్, కాంగ్రెస్  ప్రయత్నాలను  ప్రారంభించాయి.  

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో  సుమారు  35 వేలకు పైగా  దొంగ ఓట్లు నమోదయ్యాయని  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కేంద్ర ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేశారు.  తుమ్మల నాగేశ్వరరావు తరపు ఆయన  ప్రతినిధి  సోమవారంనాడు  కేంద్ర ఎన్నికల సంఘానికి  ఫిర్యాదును అందించారు.దొంగ ఓట్లు తొలగించే వరకు  ఎన్నికలు నిలిపివేయాలని ఆయన  కోరారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కుమ్మక్మై కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు దొంగ ఓట్లు చేర్చారు.

జిల్లా కలెక్టర్, ఖమ్మం, మున్సిపల్ కమిషనర్ ను బదిలీ చేయాలని  తుమ్మల నాగేశ్వరరావు  కోరారు. దొంగ ఓట్లు తొలగించి  తుది జాబితా ప్రకటించాలని ఆయన కోరారు. ఇంటి నెంబర్లు లేకుండా ఓట్లు నమోదు చేశారని తుమ్మల నాగేశ్వరరావు  ఈసీకి సమర్పించిన  ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు  దొంగ ఓట్ల వివరాలను  ఆధారాలతో  సహా ఈసీకి అందించారు. ఐదు నియోజకవర్గాల్లో  దొంగ ఓట్లను నమోదు చేయించారని తుమ్మల నాగేశ్వరరావు  పేర్కొన్నారు.  ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  కోరారు. ఈ విషయమై  రాష్ట్రంలోని ఎన్నికల అధికారులకు , కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని  తుమ్మల నాగేశ్వరరావు  ఆరోపించారు. 

ఈ ఏడాది సెప్టెంబర్ వరకు  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో ఉన్నారు. సెప్టెంబర్ మాసంలోనే  ఆయన  బీఆర్ఎస్ ను వీడి  కాంగ్రెస్ లో చేరారు.  ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి తుమ్మల నాగేశ్వరరావు   కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానంనుండి టీడీపీ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు  విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానంనుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ చేతిలో  ఆయన  ఓటమి పాలయ్యారు.

also read:కేసీఆర్ కు ఆ పదవి ఇప్పించిందే నేను...: తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నుండి బీఆర్ఎస్ టిక్కెట్టును తుమ్మల నాగేశ్వరరావు ఆశించారు. అయితే తుమ్మల నాగేశ్వరరావుకు నిరాశే మిగిలింది. దీంతో తుమ్మల నాగేశ్వరరావు  బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. నిన్న  ఖమ్మం సభలో  తుమ్మల నాగేశ్వరరావుపై  కేసీఆర్ విమర్శలు గుప్పించారు.