మాజీ మంత్రి నాయిని ఆరోగ్యం మరింత విషమం: మంత్రి హరీష్ పరామర్శ
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా ఆపోలో వైద్యులు తెలిపారు.
సెప్టెంబర్ 30వ తేదీన కరోనా సోకడంతో ఆయన హైద్రాబాద్ ఆపోలో ఆసుపత్రిలో చేరారు. ఇదే ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకొంటున్నారు. కరోనా నుండి కోలుకొన్నప్పటికీ ఆయన శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. నాయిని ఆరోగ్యం మరింత విషమించినట్లు వైద్యులు చెబుతున్నారు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రబాకర్ రెడ్డి నాయినిని పరామర్శించారు. కిడ్నీల్లో పొటాషియం స్థాయిలు పెరిగినట్లు, ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు మంత్రికి చెప్పారు.
మంగళవారం నాడు మంత్రి నిరంజన్ రెడ్డి నాయిని నర్సింహ్మారెడ్డిని పరామర్శించారు. శ్వాసకోశ సంబంధమైన సమస్యలతో ఇబ్బందిపడుతున్న నాయిని ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. కిడ్నీ సంబంధమైన ఇబ్బందులు కూడ తలెత్తినట్టుగా వైద్యలు మంత్రికి వివరించారు. కిడ్నీ సంబంధమైన సమస్యలకు డయాలసిస్ చేస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. వైద్యానికి ఆయన సరిగా స్పందించడం లేదని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స అందించాలని మంత్రి వైద్యులను ఆదేశించారు.
also read:మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి కేటీఆర్
కరోనా కంటే ముందుగానే ఆయనకు గుండెకు సంబంధమైన శస్త్రచికిత్స జరిగింది. కరోనా చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరారు. వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సోమవారం నాడు తెలంగాణ మంత్రి కేటీఆర్ నాయినిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకొన్నారు. నాయిని కొడుకు, అల్లుడికి కూడ కరోనా సోకిన విషయం తెలిసిందే.