కాళేశ్వరంలో మనీలాండరింగ్, కేసీఆర్కు జైలు తప్పదు: నాగం
కేసీఆర్పై నాగం ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు రిజర్వాయర్ల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. ఈ విషయంలో మనీ లాండరింగ్కు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపించారు.ఈ విషయమై ఈడీ, సీబీఐకు ఫిర్యాదు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయమై సీబీఐ విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు.
సోమవారం నాడు గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రాజెక్టుల రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్ పేరుతో కేసీఆర్ లక్షల కోట్ల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షలాది రూపాయాలు అవినీతికి సర్కార్ పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహ నిరూపించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అవసరం లేకున్నా మూడు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారని ఆయన చెప్పారు.మూడు లిఫ్టులు అవసరం లేదన్నారు. మూడు రిజర్వాయర్ల విషయంలో మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నిరూపిస్తానని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కావాలని లేఖలు పెడితే ఆ సమాచారాన్ని ఇవ్వడం లేదన్నారు.
మనీ లాండరింగ్ జరిగిన తేట తెల్లమైందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పనులను దక్కించుకొన్న ఓ కాంట్రాక్టు కంపెనీ కోసం నియమనిబంధనలను మార్చారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో చేసిన పనులను తాను చేసినట్టుగా కేసీఆర్ ప్రచారం చేసుకొంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
8 మాసాల తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పేనును అంబేద్కర్ ప్రాణిహిత-చేవేళ్ల ప్రాజెక్టుగా మారుస్తామని నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టుల రీ డిజైన్, రీ ఇంజనీరింగ్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్టు ఆయన ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి 10 మాసాల్లో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంటే ఇంతవరకు 10 శాతం కూడ పనులు పూర్తి కాలేదని నాగం జనార్ధన్ రెడ్డి చెప్పారు.
ప్రాజెక్టుల రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్ పేరుతో అవినీతికి పాల్పడిన అధికారులకు జైలు తప్పదని నాగం జనార్ధన్ రెడ్డి హెచ్చరించారు. బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడి చేస్తోందని ఆయన విమర్శించారు.పాలమూరు జిల్లాలో 10 శాతం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.