మానుకోటలో ఉద్యమకారులపై దాడికి పాల్పడిన కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఉద్యమ కారుల రక్తం  చూసినందుకే ఆయనకు పదవి ఇచ్చారని ఆయన మండిపడ్డారు.

హైదరాబాద్:మానుకోటలో ఉద్యమకారులపై దాడికి పాల్పడిన కౌశిక్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. ఉద్యమకారుల రక్తం కళ్ల చూసినందుకు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా అని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆయన గత వారం క్రితం చేరారు. ఈటల రాజేందర్ నిమ్స్ ఆసుపత్రిలో మోకాళ్లకు శస్త్రచికిత్స జరిగింది. గురువారం నాడు ఉదయం ఆయన ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను పాదయాత్రను కొనసాగిస్తానని ఆయన చెప్పారు.తాను ఎలా పనిచేస్తానో కూడ హరీష్ రావుకు తెలుసునని ఆయన చెప్పారు. తాను వీల్ చైర్ లో ప్రచారం చేసి సానుభూతి కోసం ప్రయత్నిస్తానని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించనని ఆయన తేల్చి చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

also read:గంగులకు ఈడీ షాక్: మంత్రి గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు

కేసీఆర్ ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్నారన్నారు. తనపై రాళ్లేసినవారికి ఇప్పుడు కేసీఆర్ పదవులు ఇస్తున్నారన్నారు. దళితులకు సీఎం పదవి ఇస్తానన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. అంతేకాదు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పగించిన రాజయ్యను భర్తరఫ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దళితులకు ఏం న్యాయం చేశారని ఆయన ప్రశ్నించారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని దళితులకు దళితబంధు పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.దళిత బంధు పథకంతో పాటు బీసీల్లో కూడ ఆర్ధికంగా వెనుకబడిన వారికి కూడ ఆర్ధికంగా తోడ్పాటు అందించాలని ఈటల రాజేందర్ సీఎంను కోరారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఈ కార్యక్రమాలను అమలు చేయాలని ఆయన కోరారు.

అక్రమంగా సంపాదించిన వేల కోట్ల డబ్బును హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపించారు. వందల పోలీసులు మఫ్టీలో వచ్చి ఒక్కో కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.2018లో తనను ఓడించేందుకు పార్టీలోనే కొందరు నేతలు ప్రయత్నించారని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. 

టీఆర్ఎస్ నేతలు ఎన్ని తాయిలాలు ఇచ్చినా ప్రజలు తీసుకొంటారు, కానీ ఓటు మాత్రం నాకే వేస్తానని ప్రజలుహామీ ఇస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటికే హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు రూ. 150 కోట్లను ఖర్చు చేశారన్నారు. కేసీఆర్ కు ప్రజలపై ప్రేమ కంటే హుజూరాబాద్ లో ఓట్లపైనే మక్కువ ఉందన్నారు.తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమ ద్రోహులు పార్టీలో చేరారన్నారు. ఉద్యమకారులకు కేసీఆర్ ఏ రకమైన గౌరవం ఇస్తున్నారో తేటతెల్లమైందన్నారు.