బీఆర్ఎస్లో మరోసారి కలకలం .. సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ
బీఆర్ఎస్ సీనియర్ నేత, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ .. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయా లేక మరేదైనా కారణం వుందా అన్నది తెలియాల్సి వుంది.
![former ghmc mayor bonthu rammohan met telangana cm revanth reddy ksp former ghmc mayor bonthu rammohan met telangana cm revanth reddy ksp](https://static-ai.asianetnews.com/images/cf292ee7-a4d9-4b0f-ab22-547a698bf451/image_363x203xt.jpg)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు , రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్లు సీఎంతో భేటీ అయ్యారు. తమ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకే ఆయనను కలిశామని వారు చెబుతున్నప్పటికీ.. రాజకీయ కారణాలు వున్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ .. సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
గత కొంతకాలంగా రామ్మోహన్.. పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో వున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ను ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. చివరి వరకు ప్రయత్నించినప్పటికీ.. బీఆర్ఎస్ పెద్దలు బండారు లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించడంతో రామ్మోహన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాతి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్న ఆయన.. కనీసం లోక్సభ టికెట్ అయినా దక్కుతుందేమోనని ఆశిస్తూ వుండగా అది కూడా నెరవేరే అవకాశాలు కనిపించకపోవడంతో పార్టీ మారుతారనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం తెలుగు రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయా లేక మరేదైనా కారణం వుందా అన్నది తెలియాల్సి వుంది.