జనగామ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీ వార్.. బండి సంజయ్కు ఎమ్మెత్యే ముత్తిరెడ్డి సవాలు..
జనగామ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఇరు పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు సవాలు విసురుతూ టీఆర్ఎస్ భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది.
జనగామ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ఇరు పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర నేడు జనగామ జిల్లా కేంద్రంలో కొనసాగనుంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే బీజేపీ ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు, హోర్డింగ్లను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేసినట్టుగా చెబుతున్నారు. టీఆర్ఎస్ నాయకులే ఈ పని చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు బండి సంజయ్కు సవాలు విసురుతూ టీఆర్ఎస్ కూడా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసింది. బండి సంజయ్ జనగామలో అడుగు పెట్టాలంటే.. నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఫ్లెక్సీలు, హోర్డింగ్స్లో డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలు అవుతన్న పథకాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? లేదా? అనేది బండి సంజయ్ ప్రకటించాలని అన్నారు. దీంతో జనగామలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఇక, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పాదయాత్రలో భాగంగా దేవరుప్పులలో బండి సంజయ్ మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజవర్గంలో అభివృద్ది జరగలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. అయితే బండి సంజయ్ కామెంట్స్పై అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసకుంది. ఇది కాస్తా టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మద్య రాళ్ల దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. అయితే బండి సంజయ్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసే టీఆర్ఎస్ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులును అదుపులో పెట్టుకుని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మండిపడుతున్నారు.