రేవంత్పై ఫిర్యాదు చేసేందుకు రెడీ!.. ఢిల్లీ పర్యటనకు టీ కాంగ్రెస్ నేతల ప్లాన్..!
తెలంగాణ రాజకీయాల్లో ఉచిత విద్యుత్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఉచిత విద్యుత్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అధికార బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ పార్టీని రైతు వ్యతిరేకిగా ప్రజల్లోకి తీసుకెళ్లే యత్నం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ మోడ్లోకి వెళ్లింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిస్తుందని కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. గతంలో ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి.. నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని వారు వాదనలకు దిగారు.
అయితే కాంగ్రెస్ అధిష్టానంతో పార్టీలో విభేదాల గురించి నాయకులు ఇటీవల బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వ్యవహారంపై పార్టీలోని కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయని భావిస్తున్న వారు.. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఓ కాంగ్రెస్ సీనియర్ నేత నివాసంలో సమావేశమైన పలువురు నేతలు.. ఢిల్లీకి వెళ్లి రేవంత్ రెడ్డిపై హైకమాండ్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రేవంత్ వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరిగిందని నివేదికతో కూడిన ఫిర్యాదును కూడా వారు సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా.. రేవంత్ ఇష్టానుసారం ఎలా మాట్లాడతారని వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రేవంత్ వ్యవహార శైలిని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
జులై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరుగుతున్న ప్రస్తుత విపక్ష పార్టీల సమావేశం కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో ఉన్నారు. వారు తిరిగి ఢిల్లీ చేరుకున్న తర్వాత.. తాము కూడా ఢిల్లీ వెళ్లి రేవంత్పై ఫిర్యాదు చేయాలని టీ కాంగ్రెస్లోని పలువురు నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారు జూలై 19 తర్వాత ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.