తెలంగాణ వ్యాప్తంగా పలు రైస్ మిల్లులపై ఎఫ్‌సీఐ దాడులు నిర్వహిస్తోంది. రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలపై ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. 60 ప్రత్యేక బృందాలతో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా పలు రైస్ మిల్లులపై ఎఫ్‌సీఐ దాడులు నిర్వహిస్తోంది. రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలపై ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. 60 ప్రత్యేక బృందాలతో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ ద్వారా అప్పగించే క్రమంలో రైస్‌ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలపై ఎఫ్‌సీఐ సీరియస్‌గా ఉంది. గతేడాదికి సంబంధించి రైస్ మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వాల్సిన గడువు ముగిసినప్పటికీ.. మిల్లర్లు ధాన్యం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే అధికారులు తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. రైస్‌ మిల్లుల్లో తనిఖీలు చేస్తున్న ఎఫ్‌సీఐ అధికారుల బృందాల వరి సేకరణ, బియ్యం ప్రాసెసింగ్‌ స్థితిగతులను సమీక్షించనున్నాయి.

ఇక, ధాన్యం అవకతవకల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రైస్‌ మిల్లుల్లో స్టాక్స్‌ పరిశీలనకు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఎఫ్‌సీఐ అధికారులను కేంద్రం ఆదేశించిందని కేంద్ర మంత్రి కిషన్ కొద్ది రోజుల కిందట తెలిపిన సంగతి తెలిసిందే. గత రెండు వ్యవసాయ సీజన్లలో దాదాపు 4.5 లక్షల వరి ధాన్యం బస్తాలు మాయమైనట్లు తమకు ఫిర్యాదులు అందాయని ఎఫ్‌సీఐ అధికారులు తెలిపారు. 2020–21 యాసంగి ధాన్యానికి సంబంధించి 1.96 లక్షల ధాన్యం సంచులు, వానకాలం ధాన్యానికి సంబంధించి 2.58 లక్షల ధాన్యం సంచులు మాయమైనట్టు గుర్తించారు. ఇందుకు సంబంధించి 40 రైస్ మిల్లుల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.