ఔటర్పై ఆత్మహత్య: ఒక్క రోజే ఫైజల్ 12 ఫోన్ కాల్స్
జల్సాల కోసం స్నేహితులు, తనకు తెలిసిన వారి నుండి లక్షలాది రూపాయాలను ఫైజల్ అహ్మద్ అప్పుగా తీసుకొన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తక్కువ రోజుల్లోనే ఎక్కువ వడ్డీలకు డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు తమ విచారణలో గుర్తించినట్టుగా సమాచారం.
హైదరాబాద్:జల్సాల కోసం స్నేహితులు, తనకు తెలిసిన వారి నుండి లక్షలాది రూపాయాలను ఫైజల్ అహ్మద్ అప్పుగా తీసుకొన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తక్కువ రోజుల్లోనే ఎక్కువ వడ్డీలకు డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు తమ విచారణలో గుర్తించినట్టుగా సమాచారం.
ఈ నెల 4వ తేదీన ఔటర్ రింగు రోడ్డుపై మంచిరేవుల వద్ద కారులోనే ఫైజల్ అహ్మద్ ఫిస్టల్తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తన భర్త ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని ఫైజల్ భఆర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తను హత్య చేసి చేతిలో ఫిస్టల్ పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనకు పలు సంస్థలతో సంబంధాలు ఉన్నాయని వాటిలో పెట్టుబడి పెడితే ఆరు మాసాల్లోనే రెట్టింపు డబ్బులు ఇస్తామని ఫైజల్ తన స్నేహితులను నమ్మించినట్టుగా విచారణలో పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది.
ఇలా చెప్పి ఆరు మాసాల్లో డబ్బుల్లో సగం చెల్లించి మిగతా సగాన్ని తానే తీసుకొని ఇతరులకు చెల్లించేవాడని పోలీసులు గుర్తించారు. ఇలా అప్పులు తీసుకొన్న డబ్బులతో ఫైజల్ జల్సాలకు వినియోగించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా సుమారు కోట్ల రూపాయాలు అప్పు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఫైజల్ సంగారెడ్డిలోని ఓ స్నేహితుడితో 12 దఫాలు ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ ఫోన్ మాట్లాడిన తర్వాతే ఫైజల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూఎస్ కన్సల్టెన్సీ పేరుతో ఉన్న సంబంధాలు ఉన్నట్టుగా ప్రచారం సాగిన కంపెనీలను కూడ పోలీసులు ఆరా తీసినట్టుగా సమాచారం. అయితే తమ కంపెనీలతో ఫైజల్ అహ్మద్ కు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారని తెలుస్తోంది.