ఇన్నాళ్లూ పప్పు అంటూ ఎవరినైతే అవహేళన చేశారో, ఇప్పడదే రాహుల్ గాంధీ అందరికీ పప్పా అయ్యాడంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఎంపీ వీ హనుమంతరావు. ఈసారి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అవుతారని ఆయన జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఎంపీ వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో బుధవారం జరిగిన ఓబీసీ నాయకుల సమావేశంలో వీహెచ్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లూ పప్పు అంటూ ఎవరినైతే అవహేళన చేశారో, ఇప్పడదే రాహుల్ గాంధీ అందరికీ పప్పా అయ్యాడంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ఆయన గ్రాఫ్ పెరిగిందని.. కష్టపడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వీ హనుమంతరావు జోస్యం చెప్పారు. పార్టీలో చిన్న చిన్న కోపాలు, గొడవలు వున్నాయని.. సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు వున్నాయని వీహెచ్ అంగీకరించారు. సీనియర్‌పై జూనియర్ పెత్తనం చెలాయిస్తే వూరుకోరు కదా.. ఇది కూడా అలాంటిదేనన్నారు. 

ALso Read: స్ట్రాటజీ రోడ్ మ్యాప్‌తో ఎన్నికలకు వెళ్తాం: కేసీఆర్ పై కోమటిరెడ్డి ఫైర్

సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే నాంపల్లి దర్గా దగ్గర కేసీఆర్ అడుక్కునేవారని వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టినోడికి కేసీఆర్ సున్నం పెడతారని.. కాంగ్రెస్‌ను కాదు ఆయననే జనం బంగాళాఖాతంలో వేస్తారని హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఈసారి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధాని అవుతారని ఆయన జోస్యం చెప్పారు. అదానీకి, మోడీకి సంబంధం ఏంటని నిలదీసినందుకు రాహుల్ గాంధీపై కక్ష సాధింపుకు దిగారని వీహెచ్ ఆరోపించారు. రాహుల్ తన భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిశారని.. తాను రాహుల్, సోనియా గాంధీ మాట మాత్రమే వింటానని ఆయన స్పష్టం చేశారు.