ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. 

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో యుద్దానికి తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇక, గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరం అవుతున్నారనే ప్రచారం సాగుతుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

న్యూ ఈయర్ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించిన పొంగులేటి.. ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచురులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న 3+3 భద్రతను 2+2కు కుదించిన ప్రభుత్వం.. ఆయన పర్యటనల సమయంలో వినియోగించే కాన్వాయ్‌లోని ఎస్కార్టు వాహనాన్ని కూడా తొలగించింది. దీంతో బీఆర్ఎస్‌ అధిష్టానానికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య చెడిందని.. పార్టీ ఆయనను దూరం పెట్టిందనే ప్రచారం మరింత జోరుగా సాగుతుంది. 

తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌ కూడా.. ఆ వార్తలకు బలం చేకూర్చినట్టుగా ఉన్నాయి. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు జరగుతున్నాయని పొంగులేటి కామెంట్ చేసిన నేపథ్యంలో.. ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట.