రేవంత్ చాణక్యం.. త్వరలో కాంగ్రెస్ గూటికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి..?
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ రోజు ఆయనతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాజకీయ అంశాల కంటే, అభివృద్ధి అంశాలపైనే చర్చించామన్నారు. నిరుద్యోగం, కృష్ణా జలాల వివాదాలపై చర్చించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపట్టబోయే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని స్పష్టం చేశారు. తెలంగాణ ఆకాంక్షలతో ఎవరు పోరాటం చేసినా తాను మద్ధతిస్తానని విశ్వేశ్వర్ రెడ్డి తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరాలనేది త్వరలోనే వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత ఆయన పలు పార్టీల నేతలతో భేటీ అయినప్పటికీ ఇంత వరకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అప్పట్లో ఈటల బీజేపీలో చేరే సమయంలో కొండా కూడా కాషాయ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం నడిచింది. కానీ విశ్వేశ్వర్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కొండాతో రేవంత్రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Also Read:పాత కాంగ్రెస్ నేతలపై రేవంత్ ఫోకస్: కొండా విశ్వేశ్వర్ రెడ్డితో భేటీ.. ఏం జరుగుతోంది..?
తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నేతలతో పాటు గతంలో పార్టీని వీడిన వారు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నేతలు తమతో టచ్లో వున్నారని రేవంత్ రెడ్డి మీడియాతో అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డిని రేవంత్ కలిశారు.