ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశా... నీతి నియమాలతోనే అభివృద్ధి పనులు : తుమ్మల నాగేశ్వరరావు
తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానని అన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 40 ఏళ్ల రాజకీయ జీవితం సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ క్రమంలో తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశానని.. ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. నీతి నియమాలతో భారీ ప్రాజెక్ట్లు పూర్తి చేశానని .. వేల కోట్లతో జాతీయ రహదారులను సాధించానని తుమ్మల గుర్తుచేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం సంతృప్తినిచ్చిందని నాగేశ్వరరావు అన్నారు.
అంతకుముందు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ప్రస్తుతం తామంతా బీఆర్ఎస్ లో ఉన్నామన్నారు. బీఆర్ఎస్ లో తనకు దక్కిన గౌరవం ఎమిటో మీకు తెలుసునన్నారు. అనుచరులతో భేటీకి ఇది రాజకీయ వేదిక కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కానీ, భవిష్యత్తులో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నట్టుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆదరాభిమానాలు ఉన్న నాయకుడు ప్రజా ప్రతినిధి కావాల్సిన అవసరం ఉందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలా జరిగినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. మిగిలిన విషయాలను సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తన అనుచరులు ఏం కోరుకుంటున్నారో అది చేసి చూపిస్తానని ఆయన ప్రకటించారు.
ALso REad: ఖమ్మంలో వేడేక్కిన రాజకీయం: పోటాపోటీగా బీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనాలు
మరో వైపు పాలేరు నుండి వచ్చే ఎన్నికల్లో పోటీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగం సిద్దం చేసుకుంటున్నారు. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా ఉన్న అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో తుమ్మల నాగేశ్వరరావు తరచుగా సమావేశమౌతున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇవాళ తన స్వగ్రామం బారెగూడెంలో నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాలని పార్టీ క్యాడర్ కు ఆహ్వానాలు పంపారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రావాలని ఆహ్వానాలు పంపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
ఈ తరుణంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆత్మీయసమ్మేళం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2014 ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ా పార్టీ టికెట్ ను కేటాయించలేదు. టీడీపీ నుండి బీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రంగం సిద్దం చేసుకుంటున్నారు.పాలేరు నుండి పోటీ చేసేందుకు కూడా ఆయన ఆసక్తిని చూపుతున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.