తెలంగాణలో టైం వేస్ట్.. జగన్ జైలుకు పోవచ్చు, ఆంధ్రాలో అయితే బెటర్ : షర్మిలపై కడియం శ్రీహరి వ్యాఖ్యలు
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి. ఆమె తెలంగాణలో పాదయాత్ర చేయడం వేస్ట్ అని.. షర్మిల ఆంధ్రాకు వెళ్లి ప్రజలకు మొరపెట్టుకోవాలని ఆయన సూచించారు.
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కడియం శ్రీహరి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్పై షర్మిల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆమె మాటలు బాధాకరమన్న ఆయన.. వైఎస్ కుటుంబం తొలి నుంచి తెలంగాణకు వ్యతిరేకమన్నారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు విజయమ్మ, షర్మిల పాదయాత్రలు చేసి, పార్టీని అధికారంలోకి తెచ్చారని కడియం శ్రీహరి అన్నారు. అయితే తల్లి, చెల్లికి జగన్ అన్యాయం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. షర్మిల ఆంధ్రాకు వెళ్లి ప్రజలకు మొరపెట్టుకోవాలని.. ఒకవేళ జగన్ జైలుకు వెళితే ఆమెకు అవకాశం వస్తుందని శ్రీహరి జోస్యం చెప్పారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేయడం వల్ల సమయం వృథానే అని ఆయన అన్నారు.
Also REad: హరీష్ కొత్తసీసాలో కేసీఆర్ పాత సారా..: తెలంగాణ బడ్జెట్ పై షర్మిల సెటైర్లు
ఇదిలావుండగా.. తెలంగాణ బడ్జెట్పై వైఎస్ షర్మిల స్పందించారు. కొత్త సీసాలో పోసిన పాత సారా మాదరిగా రాష్ట్ర బడ్జెట్ వుందని ఆమె సెటైర్లు వేశారు. ఆర్ధిక మంత్రి హరీశ్ కొత్త ఏడాది కదా అని కొత్త సీసా తీసుకుని ఫాంహౌస్కు వెళితే.. అందులో ఆయన మామ పాత సారా పోశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్ను కాపీ పేస్ట్ చేశారని.. దీనిని వేస్ట్ పేపర్గా మార్చారంటూ ఆమె దుయ్యబట్టారు. రుణమాఫీ చేస్తామని రైతులను మరోసారి మోసం చేశారని షర్మిల ఆరోపించారు.