కొందరు ఎస్సైలు నా వాళ్లని వేధిస్తున్నారు.. ఊరుకునేది లేదు, దసరా వరకు డెడ్లైన్ : జూపల్లి కృష్ణారావు
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులను కొందరు పోలీసులు టార్గెట్ చేశారని.. చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. దసరా తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతానని కృష్ణారావు వెల్లడించారు.
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కొందరు అధికారులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ఎస్సైలపై చర్యలు తీసుకోవాలని జూపల్లి కోరారు. తన అనుచరులపై కొందరు అధికారులు కక్షగట్టారని.. ఇదే తీరు పునరావృతమైతే చూస్తూ ఊరుకోనని జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. పద్ధతి మార్చుకోకుంటే పోలీసుల తీరుపై నిరసనలకు దిగుతానని ఆయన స్పష్టం చేశారు. దసరా తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతానని కృష్ణారావు వెల్లడించారు.
కాగా... గత కొద్దిరోజులుగా ఉమ్మడి మహబూబ్ నగర్ టీఆర్ఎస్లో జూపల్లి విషయం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వర్గాల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జూపల్లి కొన్ని నెలల క్రితం ఖమ్మం జిల్లాలో పర్యటించడం హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసంతృప్తి నేతలుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లిన జూపల్లి.. తుమ్మలతో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఖమ్మంలోనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ క్రమంలోనే జూపల్లి పార్టీ మారనున్నారనే ప్రచారం సాగుతూ వచ్చింది. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా జూపల్లి హాజరు కాకపోవడం.. ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే దానిపై స్పందించిన జూపల్లి.. తాను టీఆర్ఎస్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో జూపల్లిని కలిసిన మంత్రి కేటీఆర్ సర్దుకుపోవాలని సూచించినట్లుగా సమాచారం. అయినప్పటికీ కొల్లాపూర్లో ఎలాంటి మార్పూ రాలేదు.