బీఆర్ఎస్తో పొత్తుకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట మార్చారు. అధిష్టానం నిర్ణయం మేరకే పొత్తులు వుంటాయని ఆయన స్పష్టం చేశారు.
బీఆర్ఎస్తో పొత్తుకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్తో పొత్తు వుంటుందని తాను చెప్పలేదని.. అధిష్టానం నిర్ణయం మేరకే పొత్తు వుంటుందని ఆయన పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యమని జానారెడ్డి తేల్చిచెప్పారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా 17 రాజకీయా పార్టీలు కాంగ్రెస్తో కలిసి పోరాడుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
అంతకుముందు త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపై జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పదనుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయన్నారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పొత్తును ప్రజలే నిర్ణయిస్తారని జానారెడ్డి వ్యాఖ్యానింనచారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తాయని ఆయన అన్నారు. రాహుల్పై లోక్సభ సచివాలయం అనర్హత వేటు వేయడాన్ని కేసీఆర్, కేటీఆర్, కవిత ఖండించారని జానారెడ్డి గుర్తుచేశారు.
Also REad: తప్పదనుకుంటే బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు : జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తులుంటాయని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సెక్యులర్ పార్టీలుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య పొత్తులు కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమయ్యాయి. ఈ వ్యవహారంపై గతంలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీ మాణిక్ రావు థాక్రే స్పందించారు.
పొత్తులపై చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి ఉపసంహరించుకున్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవని మాణిక్ రావు తెలిపారు. ప్రస్తుతం నేతలంతా ఐక్యంగా వున్నారని.. నాయకులంతా త్వరలోనే పాదయాత్రలు చేస్తారని థాక్రే స్పష్టం చేశారు. బీజేపీ లాంటి శక్తులు పొత్తుల పేరుతో తమను వీక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని థాక్రే పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత బలం కాంగ్రెస్కు వుందని ఆయన స్పష్టం చేశారు.
