రా'బంధు'లున్నంత కాలం తెలంగాణ గడ్డపై ఇదే పరిస్థితి: కేసీఆర్ సర్కార్ పై ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం
తెెలంగాణలో నిరుద్యోగులు, నిస్సహాయుల ఆత్మహత్యలపై స్సందిస్తూ మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై మరోసారి సీరియస్ అయ్యారు మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇటీవల కరీంనగర్ జిల్లాలో ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోగా... దీనిపై సోషల్ మీడియా లో స్పందిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ప్రవీణ్.
''నీళ్లు-నిధులు-నియామకాలు అన్న నినాదంతో గద్దెనెక్కి ఏటా లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి ప్రాజెక్టుల (కొత్త సచివాలయం తో సహా) స్కెచ్ లు వేసి వేల కోట్లను దోచుకుంటున్న రా’బందు’లున్నంతకాలం తెలంగాణ గడ్డలో విలువైన ప్రాణాలు ఇట్ల పోతనే ఉంటై. శ్రమ ఎవరిది? సిరి ఎవరిది?'' అంటూ జమ్మికుంటలో నిరుద్యోగితో పాటు సికింద్రాబాద్ లో పిల్లల కాలేజీ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటనల వార్తలను జతచేస్తూ ప్రవీణ్ ట్విట్ చేశారు.
read more గులాబీ జెండా పీకేసి నీలి జెండా ఎగరేద్దాం...: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఐటిఐ చేసి, డిగ్రీ చదివి, ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ తీసుకున్నా ఉద్యోగం రావడం లేదనే మనస్థాపంతో జమ్మికుంట రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి మహ్మద్ షబ్బీర్(26) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామం. ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ తీసుకుని కొన్ని రోజులు హైదరాబాద్ లో నీ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. లాక్ డౌన్ కారణంగా ఆ ఉద్యోగం పోగా జమ్మికుంట పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండేవాడు.
తొమ్మిది నెలల క్రితమే షబ్బీర్ కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే ఉద్యోగం రాక కుటుంబ పోషణ భారంగా మారడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీంతో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత ఆదివారం నిరుద్యోగి షబ్బీర్ ఆత్మహత్య చోటుచేసుకోగా తాజాగా ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు.
ఇక కన్న కూతుళ్ల కాలేజీ ఫీజు కట్టలేని దీనస్థితిలో ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక కారణాలతో సతమతం అవుతూ ఆల్వాల్ వెంకటాపురానికి చెందిన మహేష్ గౌడ్ రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఆర్థిక కష్టాలు నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాదు ఓ కుటుంబానికి మగదిక్కు లేకుండా చేసింది. ఈ విషాద ఘటనపై కూడా మాజీ ఐపిఎస్ ప్రవీణ్ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.