పథకాలు ప్రచారానికి పరిమితం... కేసీఆర్ సర్కార్ చేసిందేమీ లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (వీడియో)
మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమర్ గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
కరీంనగర్: టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రచారాలపై ఉన్న శ్రద్ధ నిరుపేదలపై లేదని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ప్రజలకు అందించే పథకాలను ప్రచారాలకు మాత్రమే పరిమితం చేసారు...అంతే తప్ప రాష్ట్ర ప్రజానికానికి చేసిందేమీ లేదని ప్రవీణ్ కుమార్ అన్నారు.
వీడియో
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ మేడి అంజయ్య తో కలిసి మాజీ ఐపిఎస్ ప్రవీణ్ విస్తృతంగా పర్యటించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొదట గ్రామ శివారులోని నాటు కోళ్ల ఫామ్ ను సందర్శించారు. ఆ పక్కనే వరి నాట్లు వేసే మహిళా కూలీలతోనూ ముచ్చటించారు. అలాగే గొర్ల కాపరులు నివాసముండే ఇళ్లను కూడా పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఉన్న అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
read more ఆగస్టు 8న బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. వేదికగా నల్గొండ, 5 లక్షల మందితో భారీ సభ
ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడారు... కరీంనగర్ జిల్లాతో తనకు 20 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. తాను ఐపీఎస్ అధికారిగా మొదటగా కరీంనగర్ జిల్లాలోనే పని చేసానని.. ప్రస్తుతం ఐపీఎస్ అధికారిగా స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసి మళ్ళీ కరీంనగర్ జిల్లాలోనే మొదటిసారిగా పర్యటించడం జరిగిందన్నారు.
గత 60 ఏళ్ల కిందట ఎలా వుందో ప్రస్తుతం కూడా పేదల బతుకు అలాగే ఉందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వందల కోట్ల రూపాయలు పెట్టే ఖర్చు పేదల కోసం పెడితే బాగుంటుందని టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. బహుజన రాజ్యం స్థాపించి.. ఎవరి భవిష్యత్తును వారే నిర్ణయించుకునే వరకు తాను పోరాడుతామనని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.