కేసీఆర్ కుటుంబ పాలనను వదిలేది లేదు.. ఎన్నికల్లో విజయం బీజేపీదే: ఈటల
రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా బలంగా ఉందని అన్నారు.
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా బలంగా ఉందని అన్నారు. ఈరోజు ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ విజయపరంపర 2019 లోక్సభ ఎన్నికలతో మొదలైందని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని చెప్పారు. మునుగోడులో నైతికంగా బీజేపీనే గెలిచిందని అన్నారు. బీఆర్ఎస్తో కొట్లాడింది బీజేపీనేనని అన్నారు. మూడున్నరేళ్లలో బీజేపీ గెలిచిందని.. ఎక్కడో ఒక చోట అధికార దుర్వినియోగం, డబ్బులు, ప్రలోభాలతో బీఆర్ఎస్ గెలిచిందని.. కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదని అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనను, దోపిడీని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు.. కానీ చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు. దేశంలో కుటుంబ పార్టీల వల్ల వాళ్ల కుటుంబాలు మాత్రమే బాగుపడతాయని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారని తెలిపారు.
బీజేపీపై కొందరు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై చేస్తున్న కుట్రలను, కుతంత్రాలను తిప్పికొడుతామని తెలిపారు. మంచి ఏదో, చెడు ఏదో తెలుసుకునే శక్తి తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే ఆస్కారం ఉండటంతో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో చాపకింద నీరులా బీజేపీ విస్తరిస్తోందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు.
బీజేపీకి ఎక్కడికి వెళ్లిన ప్రజల నుంచి మద్దతు వెల్లువల వస్తుందని చెప్పారు. వరంగల్లో ప్రధాని మోదీ సభను విజయవంతం చేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ సభను రాష్ట్రంలోని పార్టీ యంత్రాంగంతా కలిసి విజయవంతం చేస్తామని అన్నారు.