చేనేతల పై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయండి : ప్రధాని మోడీకి మంత్రి ఎర్రబెల్లి లేఖ
Hyderabad: ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల సమర్థవంతమైన పాలనతో చేనేతలకు ప్రోత్సాహకాలు ఇస్తూ.. వారిని ఆదుకుంటుంటే, కేంద్రం వారి నడ్డి విరిచే లా చేనేతలపై 5శాతం జీఎస్టీ విధించడం అన్యాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Errabelli Dayakar Rao: టీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. చేనేతలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని అందులో కోరారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, చేనేత, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీ. రామారావు (కేటీఆర్) సూచన మేరకు, వారి తరహాలోనే మంత్రి కేటీఆర్ చేనేతలపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాశారు. చేనేతల పై విధించిన 5శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ పోస్టు కార్డు రాశారు. కేటీఆర్ ప్రారంభిచిన పోస్ట్ కార్డ్ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. ఆయన తన స్వ హస్తాలతో రాసిన పోస్టు కార్డును ప్రధాని మోడీకి పంపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్)ల సమర్థవంతమైన పాలనతో చేనేతలకు ప్రోత్సాహకాలు ఇస్తుంటే, చేనేత కార్మికులను ఆదుకుంటుంటే.. కేంద్ర మాత్రం వారి నడ్డి విరిచేలా చేనేతలపై 5శాతం జీఎస్టీని విధించడం అన్యాయమని ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్రంలో చేనేతలకు చేయూత, బీమా వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుంటే, కేంద్రం చేనేత కార్మికులపై కక్ష కట్టిందన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత ప్రజలు ఎక్కువగా ఆధార పడిన రంగం చేనేత అని మంత్రి తెలిపారు. అలాగే, దేశంలో ఎప్పుడూ, ఎక్కడా కే లేని విధంగా చేనేతలపై విధించిన జీఎస్టీని ఇప్పటికైనా వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, చేనేతలకు మద్దతుగా మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డుల ఉద్యమానికి పిలుపునిచ్చారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానికి స్వయంగా తానే లెటర్ రాసి పంపారు. ఇలా ప్రతిఒక్కరు చేనేత కార్మికులకు మద్దతుగా ప్రధానికి ఉత్తరాలు రాయాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో టీఆర్ఎస్, నాయకులు కార్యకర్తలతో పాటు సామాన్యులు కూడా ప్రధానికి లెటర్లు రాస్తున్నారు.
ఈ క్రమంలోనే సోదరుడి పిలుపును అందుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా చేనేతకారులకు మద్దతుగా ప్రధానికి లేఖ రాసారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... నైపుణ్యత, సృజనాత్మకత, కష్టాన్ని నమ్ముకున్న కళ చేనేత అని పేర్కొన్నారు. కాబట్టి దీన్ని వ్యాపార కోణంలో చూడకుండా వెంటనే దీనిపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని కోరారు.