చెర్లపాలెం ఎంపిటీసీ అయిన అనుమాండ్ల నరేందర్ రెడ్డి థరూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత రెండో విడత కూడా ఆయనకే ఆ పదవిని ఇచ్చారు.
వరంగల్: ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు షాక్ తగిలింది. పాలకుర్తి నియోజకవర్గంలోని ఆయన ముఖ్య అనుచురుడు కాంగ్రెసులో చేరారు.
చెర్లపాలెం ఎంపిటీసీ అయిన అనుమాండ్ల నరేందర్ రెడ్డి థరూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత రెండో విడత కూడా ఆయనకే ఆ పదవిని ఇచ్చారు. అయితే నరేందర్ రెడ్డి తన అనుచురులతో కలిసి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెసులో చేరారు.
నరేందర్ రెడ్డి కాంగ్రెసులో చేరడం వల్ల ఎర్రబెల్లి దయాకర్ రావుకు పాలకుర్తిలోనే కాకుండా వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా దెబ్బ పడుతుందని భావిస్తున్నారు.
నరేందర్ రెడ్డి చాలా కాలంగా దయాకర్ రావుతో ఉంటూ వస్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు కూడా. పాలకుర్తిలో నరేందర్ రెడ్డి చేరిక కాంగ్రెసుకు బలాన్నిస్తుందని భావిస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి అయిన జంగా రాఘవరెడ్డిని ఎదుర్కోవడం దయాకర్ రావుకు తలకు మించిన భారమవుతుందని అంటున్నారు.
అదే సమయంలో టీఆర్ఎస్ నుంచి తప్పుకుని కాంగ్రెసులో చేరిన ఎమ్మెల్సీ కొండా మురళి కూడా రాఘవరెడ్డికి మద్దతు ఇవ్వనున్నారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రమైన పోటీని ఎదుర్కునే అవకాశం ఉంది.
