విచారణకు రావాలి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు మరోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు రావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
![Enforcement Directorate Serves notices to Kalvakuntla kavitha lns Enforcement Directorate Serves notices to Kalvakuntla kavitha lns](https://static-ai.asianetnews.com/images/01hg897x70qx8qwynf3vnetrzn/kavitha-kalvakuntla_363x203xt.jpg)
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారత రాష్ట్ర సమితి కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) సోమవారం నాడు నోటీసులు పంపింది.
ఈ నెల 15వ తేదీన విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలుగు మీడియా రిపోర్ట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో గతంలో కూడ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. 2023 మార్చి మాసంలో కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. మహిళలను దర్యాప్తు సంస్థలు తమ కార్యాలయాల్లో కాకుండా ఇంట్లోనే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై 2023 నవంబర్ మాసంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. విచారణకు కవితను పిలవద్దని కోర్టు పేర్కొంది. అయితే ఆ తర్వాత ఈ పిటిషన్ పై విచారణకు సంబంధించి కోర్టులో పిటిషన్ లిస్ట్ కాలేదు. అదే సమయంలో మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. ఈ విషయమై కవిత న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని ప్రచారం సాగుతుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం నాలుగో సారి విచారణకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కాలేదు.
also read:ఓటమిపై పోస్ట్మార్టం: అసెంబ్లీ వారీగా సమీక్షించనున్న కేసీఆర్
ఇదిల ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడ ఈడీ నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో తాను ఉపయోగించిన ఫోన్లను కూడ ఈడీ అధికారులకు కవిత సమర్పించిన విషయం తెలిసిందే. గతంలో తాను ఉపయోగించిన ఫోన్లను కవిత ధ్వంసం చేశారని ఈడీ అధికారులు ఆమెపై ఆరోపణలు చేశారు.ఈ తరుణంలో ఈ ఫోన్లను కవిత ఈడీ అధికారులకు అందించిన విషయం తెలిసిందే.
also read:నామినేటేడ్ పదవుల భర్తీకి రేవంత్ కసరత్తు:కోదండరామ్కు ఎమ్మెల్సీ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ పార్టీకి చెందిన కీలక నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ ను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే నాలుగు సార్లు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులను రాజకీయ ప్రేరేపితమైనవిగా ఆప్ ఆరోపించిన విషయం తెలిసిందే.